ఏడాది లోగా తెలంగాణ: సీనియర్లు
హైదరాబాద్: 2009లోగా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని ఎఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ కాంగ్రెస్ తెలంగాణ సీనియర్లకు హామీ ఇచ్చినట్లు సమాచారం. తమ పర్యటన విజయవంతమైందని కాంగ్రెస్ సీనియర్లు చెప్పారు. ఢిల్లీలో సోనియా గాంధీని కలిసిన అనంతరం వారు శుక్రవారం ఉదయం హైదరాబాదుకు వచ్చారు. సీనియర్ కాంగ్రెస్ శాసనభ్యుడు ఉప్పునూతల పురుషోత్తమ రెడ్డి మీడియాతో మాట్లాడుతుండగా మరో సీనియర్ శాసనసభ్యుడు ఎం. సత్యనారాయణరావు ఇంటికి వెళ్లిపోయారు. సత్యనారాయణ రావు మీడియాతో మాట్లాడడానికి ఇష్టపడలేదు.
తమలో ఒకరిద్దరు వ్యతిరేకించినా భువనగిరి సభ జరుగుతుందని పురుషోత్తమ రెడ్డి చెప్పారు. సోనియాతో సమావేశం వివరాలను సభలోనే వెల్లడిస్తామని ఆయన చెప్పారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షను మేడంకు వివరించామని ఆయన అన్నారు. తాము పార్టీకి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నట్లు సోనియాకు తప్పుడు సమాచారం వెళ్లిందని, భువనగిరి సభ పోస్టర్లు చూసిన తర్వాత సోనియాకు విషయం అర్థమైందని సీనియర్ కాంగ్రెస్ నాయకుడు పాల్వాయి గోవర్ధన్ రెడ్డి చెప్పారు. రాష్ట్రంలో పార్టీ కార్యక్రమాల కన్నా ప్రభుత్వ కార్యక్రమాలకే ప్రాధాన్యం ఇస్తున్నారని తాము చెప్పినట్లు ఆయన తెలిపారు.












Click it and Unblock the Notifications