ఉప్పునూతల రాజీనామా వదంతులు
హైదరాబాద్: కాంగ్రెస్ సీనియర్ శాసనసభ్యుడు ఉప్పునూతల పురుషోత్తమ రెడ్డి తన శాసనసభా సభ్యత్వానికి రాజీనామా చేయనున్నట్లు ఊహాగానాలు చెలరేగుతున్నాయి. కొద్దిసేపట్లో సంచలన ప్రకటన చేస్తానని చెప్పిన ఉప్పునూతల పురుషోత్తమ రెడ్డి అదేమిటో చెప్పడానికి నిరాకరించారు. ఈ నెల 24వ తేదీన తలపెట్టిన భువనగిరి సభకు ముందే రాజీనామా చేయాలని ఆలోచిస్తున్నట్లు వదంతులు వ్యాపించాయి. భువనగిరి సభను రద్దు చేసుకోవాలని పార్లమెంటు సభ్యుడు వి. హనుమంతరావు చేసిన సూచనకు ఆయన తీవ్ర మనస్తాపం చెందినట్లు సమాచారం.
ఎఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీతో చర్చల అనంతరం హైదరాబాదుకు తిరిగి వచ్చిన ఉప్పునూతల చాలా ఉత్సాహంగా కనిపించారు. తెలంగాణపైనే కాంగ్రెస్ కోర్ కమిటీ సమావేశం జరుగుతుందని ఆయన చెప్పారు. కానీ భువనగిరి సభపై కోర్ కమిటీ సమావేశం జరగనున్నట్లు ప్రచారంలోకి వచ్చింది. దానికి తోడు వి. హనుమంతరావు మాత్రమే కాకుండా మల్లు రవి, కె. కేశవరావు వంటి పలువురు నాయకులు తలో రకంగా మాట్లాడారు. అంతేకాకుండా భువనగిరి సభను రద్దు చేసుకోవాలని సోనియా గాంధీ సలహాదారు అహ్మద్ పటేల్ ఉప్పునూతల పురుషోత్తమరెడ్డికి ఫోన్ చేసి సూచించారు. కోర్ కమిటీకి ముందే అహ్మద్ పటేల్ ఆ విషయం చెప్పారు. పార్టీ ప్రయోజనాల దృష్ట్యా భువనగిరి సమావేశాన్ని రద్దు చేసుకోవాలని, ఇది అధిష్ఠానవర్గం మాటగా తాను చెబుతున్నానని ఆయన అన్నారు. పురుషోత్తమ రెడ్డి మనస్తాపానికి ప్రధాన కారణం ఇదేనని అంటున్నారు.
అహ్మద్ పటేల్ ఫోన్ వచ్చిన వెంటనే పురుషోత్తమరెడ్డి తన ఆంతరంగికులతో, కొంత మంది కాంగ్రెస్ నాయకులతో ఆయన సమావేశమయ్యారు. తాము ఢిల్లీలో ఉన్నప్పటికీ తమతో మాట మాత్రంగానైనా చెప్పకుండా పురుషోత్తమరెడ్డికి అహ్మద్ పటేల్ కు ఫోన్ చేసి సభను రద్దు చేసుకోవాలని చెప్పడం జి. వెంకటస్వామి, తదితరులు ఆశ్చర్యానికి గురయ్యారు. తాజా పరిస్థితిని చర్చించేందుకు ఢిల్లీలోని వెంకటస్వామి నివాసంలో సమావేశమయ్యారు. అయితే ఎట్టకేలకు భువనగిరి సభను వాయిదా వేస్తున్నట్లు ఉప్పునూతల పురుషోత్తమరెడ్డి చెప్పారు. తెలంగాణ వస్తుందనే నమ్మకం ఉందని, తమకు సోనియా గాంధీని నమ్ముతున్నామని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications