శీను హత్యపై పటోళ్ల సంచలన లేఖ

మొద్దుశీను హత్యకు దారితీసిన పరిస్థితులేమిటి? ఆ హత్యలో కుమ్కక్కయిందెవరు? సహకరించిందెవరు? ఇందులో జైలు అధికారులు, సిబ్బంది ఎవరెవరు ఉన్నారు? అనే విషయాలను వివరిస్తానని కోర్టులో చెప్పాడు. హైకోర్టు, హోంశాఖల దృష్టికి ఈ విషయాల్ని తీసుకెళ్ళేందుకు న్యాయవాది సహాయం అవసరమని పటోళ్ళ జిల్లా న్యాయమూర్తిని కోరాడు. జైల్లోనే న్యాయవాది సహాయం తీసుకోవచ్చునని పబ్లిక్ ప్రాసిక్యూటర్ సూచించారు. తాము జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నామని, తమకు భద్రత కరువైందని, తాము ఫిర్యాదుచేయడానికి జైలు అధికారులు అనుమతించబోరని పటోళ్ళ విన్నవించుకున్నాడు. దీంతో అతను అర్జీ దాఖలుచేసుకోడానికి కోర్టు 10 నిమిషాల సమయం ఇచ్చింది. ఆ సమయంలో కోర్టు వెలుపలికి వచ్చిన పటోళ్ల భోరున విలపించాడు. పథకం ప్రకారం తన సహచరుణ్ని మట్టుపెట్టారని వాపోయాడు. తర్వాత పటోళ్ళను మాత్రమే కోర్టు లోపలికి పిలిపించింది. అతనికి గంటసేపు అనుమతి మంజూరుచేసి అతను చెప్పదలుచుకున్నది లిఖిత పూర్వకంగా రాసివ్వాలని కోర్టు ఆదేశించింది. మిగతా నిందితుల్ని జైలుకు తీసుకెళ్ళవచ్చనన్న న్యాయమూర్తి సూచనమేరకు వారిని తీసుకెళ్ళిపోయారు. ఈ క్రమంలోనే పటోళ్ళ హైకోర్టుకు, హోంశాఖ కార్యదర్శికి లేఖ రాశాడు. దానిని తన న్యాయవాదుల ద్వారా జడ్జికి అందజేశాడు.
ప్రిన్సిపల్ హోం కార్యదర్శి కోసం పటోళ్ళ తెలుగులో రాసిన లేఖలోని అంశాలు (దీనిని అతని న్యాయవాది మీడియాకు అందజేశారు.) ఇలా ఉన్నాయి...
1. 2008 ఆగస్టు 18న అనంతపురం జిల్లా జైల్లోకి నేను(పటోళ్ళ), జూలకంటి శ్రీనివాసరెడ్డి(మొద్దుశీను), సి.దామోదర్రెడ్డి ప్రవేశం పొందాం. ఆ సమయంలో జిల్లా జైలు ఇన్ఛార్జి సూపరింటెండెంట్ రాంప్రసాద్ మమ్మల్ని వివిధ బ్యారక్లలో వేస్తుండగా తీవ్ర అభ్యంతరం చెప్పాం. తనకు తీవ్ర ప్రాణహాని ఉన్నందున సింగిల్ సెల్ కేటాయించాలని మొద్దుశీను డిమాండ్చేశాడు.
2. రాంప్రసాద్ నిర్లక్ష్యంగా 'మాకు అంతా తెలుసు. రక్షణ మేం చూసుకుంటాం' అని చెప్పి మొద్దుశీనును సుమారు 30 మంది ఖైదీలున్న బ్యారక్లో బలవంతంగా ఉంచాడు.
3. తనకు ప్రాణపాయం ఉన్నందున ఆ మరుసటి రోజే మొద్దుశీను తన బ్యారక్ నంబరు-2లో నుంచి 20 మందికి పైగా ఖైదీల్ని ఖాళీ చేయించి బయటకు పంపాడు. జైలు అధికారులు మళ్ళీ మొద్దుశీను బ్యారక్లో మొత్తం 30 మంది ఖైదీలను పెట్టేవిధంగా బలప్రయోగంచేశారు. వెంటనే మొద్దుశీను తనను సింగిల్సెల్లో వేయాలని లేదా అనుమానిత ఖైదీలందరినీ ఖాళీ చేయించాలని పట్టుబట్టాడు.
4. మొద్దుశీను అభ్యంతరాలను, వ్యతిరేకతను పట్టించుకోకుండా ఓం ప్రకాశ్ను 27.10.2008న జైలరు వరుణారెడ్డి బలవంతంగా బ్యారక్ నెం.2లో వేశాడు. ఓం ప్రకాశ్ ప్రమాదకర బందిపోటు, అనుమానిత వ్యక్తి అని కొందరు వరుణారెడ్డికి చెప్పినా పట్టించుకోలేదు.
5. తనను ఒంటరి గదిలో వేయాలని, లేదా సహ ముద్దాయిలు జి.వి.రెడ్డి, వడ్డెశీన గదిలో ఉంచాలని మొద్దుశీను గత రెండున్నర నెలలుగా జైలు అధికారులు వరుణారెడ్డి, రాంప్రసాద్, లక్ష్మీనరసయ్యలను కనీసం 20 సార్లు అడిగినా మార్చలేదు. తీవ్ర అభ్యంతరం చెప్పినప్పటికీ ఓంప్రకాశ్ను మొద్దుశీను బ్యారక్లోనే వేశారు. ఇది జరిగిన పన్నెండు రోజులకే మొద్దుశీను నవంబరు 9న హత్యకు గురయ్యాడు.
6. వరుణారెడ్డి, జైలు అధికారులు- ఏ1 నిందితుడు సూరి మాట ప్రకారమే మొద్దుశీనును బ్యారక్ నంబరు రెండులోవేసి, ఆ తర్వాత ఓంప్రకాశ్ను బలవంతంగా అందులో వేశారు.
హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి పేర ఆంగ్లంలో రాసిన మరో లేఖలో విషయాలు ఇలా ఉన్నాయి...
* జూలకంటి శ్రీనివాసరెడ్డి అలియాస్ మొద్దుశీను హత్య జైలు అధికారుల సహకారం, వారు సమకూర్చిన సౌకర్యాలతోనే జరిగింది. అందులో పాత్రధారులు ...
1. డీఐజీ ప్రిజన్స్(రాయలసీమ) సునీల్ కుమార్ ప్రమేయంతోనే హత్య జరిగింది.
2. ఇన్ఛార్జి సూపరింటెండెంటు రాంప్రసాద్ అందుకు కావాల్సిన వసతుల్ని ఆగస్టు నెలలోనే సమకూర్చాడు.
3. జైలరు వరుణారెడ్డి అందుకు వత్తాసు పలికాడు.
4. డిప్యూటీ జైలరు చిరంజీవి, సూపరింటెండెంటు లక్ష్మీనర్సయ్య ఈ హత్య జరగడానికి సహకరించాడు.












Click it and Unblock the Notifications