ఆ దేవుడే రక్షిస్తాడు: రాజు మామ
గుంటూరు: సత్యం మాజీ చైర్మన్ రామలింగరాజును దేవుడు రక్షించి తీరుతాడని ఆయన మామగారు దెందుకూరు సత్యనారాయణ రాజు విశ్వాసం వ్యక్తం చేశారు. ఇంజినీర్ గా పనిచేసి రిటైరైన సత్యనారాయణ రాజు గుంటూరు జిల్లా బాపట్ల సమీపంలోను ఖాజీపాలెంలో శేష జీవితం గడుపుతున్నారు. ఆయన జర్మనీలో 25 ఏళ్ళు పని చేసి వచ్చారు.
తన అల్లుడు, సత్యం ప్రమోటర్ బైర్రాజు రామలింగరాజు చేసిన ఫోన్ కాల్ ను అందుకున్న తర్వాత 70 ఏళ్ళకు పైబడిన వృద్ధ రాజు గారు చాలా బాధపడినట్టు కన్పించింది. తనను విడివిడిగా కలిసిన కొందరు మీడియా ప్రతినిధుల వద్ద ఆయన కన్నీళ్ళు పెట్టుకున్నారు.
"నాన్నా! మేం ఎవరినీ మోసం చేయలేదు. సంస్ధ మనుగడ కోసం సొంత డబ్బులే అందులో పెట్టాం. మాకేం కాదు, అన్నీ సర్దుకుంటాయి. ముందు మీ ఆరోగ్యం జాగ్రత్త. టీవీలు, పేపర్లు చూడవద్దు" అని రామలింగరాజు భార్య నందిని తన తండ్రి సూర్యనారాయణకు ఫోన్ చేసి చెప్పారు. మొదట రామలింగరాజు, ఆ తర్వాత నందిని ఆయనతో మాట్లాడినట్టు తెలుస్తోంది. అయితే ఆ ఫోన్ కాల్ ఎక్కడి నుంచి వచ్చిందో, వారిద్దరూ ఎక్కడ ఉన్నారో సత్యనారాయణ రాజు చెప్పలేకపోయారు. తన అల్లుడు బుద్ధిమంతుడని, విలాసవంతమైన జీవితానికి దూరంగా ఉంటాడని పెద్ద రాజు గారు చెప్పారు. గ్రామీణ నేపధ్యం నుంచి వచ్చిన ఆయన అనేక సేవా కార్యక్రమాలను అనేక జిల్లాల్లో నిర్వహిస్తున్నారని ఆయన వెల్లడించారు.