లారీల సమ్మె: విజయవాడలో తీవ్ర ప్రభావం
విజయవాడ: రాష్ట్రంలో లారీల సమ్మె ప్రభావం అన్ని జిల్లాల్లో కంటే కృష్ణా జిల్లాపై తీవ్రంగా ఉంది. ఇక్కడ ఉన్నన్ని లారీలు, ప్రైవేటు బస్సులు రాష్ట్రంలో మరే జిల్లాలోను లేవు. సమ్మెతో జిల్లాలో 45 వేల లారీలు ఎక్కడివక్కడే నిలిచిపోయాయి. విజయవాడ సహా జిల్లాలోని అన్ని బంకులూ దాదాపు నిండుకున్నాయి. మరోవైపు నందిగామ, జగ్గయ్యపేట తదితర మార్కెట్యార్డుల్లో పత్తి కొనుగోళ్లు మందగించాయి. 5 రోజులుగా లారీలు లేక గుంటూరు జిన్నింగ్ మిల్లులకు వెళ్లాల్సిన లక్షలాది బోరెల పత్తి మార్కెట్లో ఉండిపోయింది. సీసీఐ కొనుగోళ్లు చేపట్టక రైతులు పడిగాపులు కాస్తున్నారు. జిల్లాలో రబీ వరి సాగుకు వ్యవసాయపనులు జరుగుతుండగా డీజిల్ లేక ట్రాక్టర్లు తిరగటంలేదు. గుడివాడ సహా పలుచోట్ల ట్రాక్టర్ల డ్రైవర్లు డీజిల్కోసం బంకుల వద్ద పడిగాపులు కాస్తున్నారు. విజయవాడ కేదారేశ్వర పండ్ల మార్కెట్కు లారీలు ఆగిపోయి కూలీలు నానా పాట్లు పడుతున్నారు.