మెజారిటీ ఇస్తే తెలంగాణ తెస్తాం
హైదరాబాద్: మాకు పూర్తి మెజారిటీ ఇవ్వండి, తెలంగాణ తెస్తాం' అనే నినాదంతో కాంగ్రెస్ రాష్ట్ర రాజకీయాలను వేడిక్కించబోతోంది. తెలంగాణ సెంటిమెంట్ గౌరవిస్తూ ప్రజల మనస్సు స్ధానం సంపాదించాలంటే ఇంతకుమించి మరోదారి లేదని అధిష్టానం నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. అందులోనూ తెలంగాణపై సానుకూల నిర్ణయం తీసుకుని, టిఆర్ఎస్తో పొత్తులు పెట్టుకుని ఉంటే తెలంగాణలో కాంగ్రెస్కు బాగా కలిసొచ్చేదని ఈ ప్రాంతానికి చెందిన మెజారిటీ కాంగ్రెస్ నేతల వాదన కూడా ప్రముఖంగా విన్పింస్తోంది.
అయితే ఢిల్లీలో ఇటీవల చోటు చేసుకున్న రాజకీయ పరిణామాలు,టిఆర్ ఎస్..మహాకూటమితో కలిసి వెళ్ళే ప్రయత్నాలు చూస్తూంటే టీఆర్ఎస్తో పొత్తులను కాంగ్రెస్ కష్టమనే సంగతి అందరికి అర్ధమైంది. అందుకే వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్కు పూర్తి మెజారిటీ ఇస్తేనే తాము మరొకరిపై ఆధారపడ కుండా తెలంగాణపై నిర్ణయం ప్రకటించడానికి వీలవుతుందనే వ్యూహంతో నచ్చచెపుదామని కాంగ్రెస్ అనుకుంటోందని విశ్వసనీయ సమాచారం. ఈ కొత్త నినాదంతో ముందు వచ్చే ఎన్నికల్లో గట్టెక్కితే అప్పడు ఆలోచించుకోవటానికి ఐదేళ్ళు సమయం ఉంటుందని కొన్ని వర్గాల భావన.