పిఆర్పీలోకి ఎమ్మెల్యే వేదవ్యాస్
హైదరాబాద్: శాసనసభ్యుడు బూరగడ్డ వేదవ్యాస్ కాంగ్రెస్ పార్టీకి రేపు (బుధవారం) రాజీనామా చేయనున్నారు. తన రాజీనామాను ఆయన రేపు అసెంబ్లీ స్పీకర్ కె.ఆర్. సురేష్ రెడ్డికి సమర్పించే అవకాశం ఉంది. ఎల్లుండి (గురువారం) ప్రజారాజ్యం పార్టీలో చేరేందుకు ఆయన రంగం సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది. వేదవ్యాస్ గత కొంత కాలంగా కాంగ్రెస్ పార్టీ పట్ల అసంతృప్తితో ఉన్నారు.
తాను రేపు ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డిని, స్పీకర్ సురేష్ రెడ్డిని, ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (పిసిసి) అధ్యక్షుడు డి. శ్రీనివాస్ ను కలిసిన తర్వాత పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి, శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేస్తానని వేదవ్యాస్ చెప్పారు. ఎల్లుండి పార్టీ అధ్యక్షుడు చిరంజీవి సమక్షంలో ప్రజారాజ్యంలో చేరుతున్నట్లు ఆయన తెలిపారు. విధానాలు నచ్చినందు వల్లనే తాను ప్రజారాజ్యంలో చేరుతున్నట్లు ఆయన చెప్పారు. పార్టీని వీడిపోయినంత మాత్రాన కాంగ్రెసుపై విమర్శలు చేయబోనని ఆయన అన్నారు.