రేవంత్ గన్ మెన్ కాల్పుల్లో ఒకరి మృతి
మహబూబ్ నగర్: మహబూబ్ నగర్ జిల్లా కొడంగల్ శాసనసభా నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ అభ్యర్థి రేవంత్ రెడ్డి గన్ మెన్ కాల్పుల్లో గాయపడిన చౌటప్ప అనే కాంగ్రెస్ కార్యకర్త మరణించాడు. తీవ్రంగా గాయపడిన చౌటప్పను హైదరాబాదులోని నిజాం వైద్య విజ్ఞాన సంస్థ (నిమ్స్)కు తరలిస్తుండగా మార్గమధ్యంలోనే అతను మరణించినట్లు సమాచారం. కాల్పుల్లో గాయపడిన మరో వ్యక్తి రాజు పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. అతను అపోలో అస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.
బుధవారం ఉదయం కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మధ్య హుస్నాబాదులో ఘర్షణ చెలరేగింది. కాంగ్రెసు కార్యకర్తలు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి రేవంత్ రెడ్డిపై దాడి చేశారు. దీంతో ఆయన గన్ మెన్ కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో కాంగ్రెసు కార్యకర్తలు కొంత మంది గాయపడ్డారు. కాంగ్రెసు కార్యకర్తల దాడిని నిరసిస్తూ రేవంత్ రెడ్డి ధర్నాకు దిగారు. రేవంత్ రెడ్డే తమపై దాడి చేశారని కాంగ్రెస్ అభ్యర్థి గుర్నాథ్ రెడ్డి ఆరోపిస్తున్నారు. చౌటప్ప మృతితో కాంగ్రెసు కార్యకర్తలు తెలుగుదేశం కార్యకర్తలపై దాడి చేయవచ్చుననే అనుమానంతో పోలీసులు ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు.