ఒబామా దెబ్బ మనకేం..ప్రధాని
చెన్నై: ఔట్సోర్సింగ్ పై అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా తీసుకున్న నిర్ణయం వల్ల మనకేం నష్టం లేదని ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ స్పష్టం చేసారు. కంపెనీలకు పన్నురాయితీలను తొలగించాలని ఒబామా తీసుకున్న నిర్ణయం అమెరికా కంపెనీల పోటీ సామర్ధ్యాన్ని దెబ్బతీస్తుందని అన్నారు. ఈ విషయాన్ని ఇప్పటికే పలు అమెరికా కార్పొరేట్ దిగ్గజాలు ఆ దేశ చట్ట సభల దృష్టికి తీసుకు వచ్చే అవకాశం ఉందని చెప్పారు. ఈ విషయమై ఆయన మీడియా సమావేశంలో అడిగిన ప్రశ్నకు బదులిచ్చారు.
ప్రభుత్వాలు ఒక్కొక్క సారి కొన్ని నిర్ణయాలు తీసుకుంటాయి, అయితే వాస్తవ పరిస్థితిని వెంటనే తెలుసుకుని అందుకు అనుగుణంగా వాటిని మార్చుకుంటూ ఉంటాయని ప్రధాని వ్యాఖ్యానించారు. అమెరికా కంపెనీలకు భారత్లాంటి దేశాల్లో తక్కువధరకు నాణ్యమైన సేవలు అందుబాటులో ఉన్నాయి. ఈ వాస్తవాన్ని అమెరికా ప్రభుత్వం త్వరలోనే గుర్తించగలదన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు.