చిరు మా ఓట్లూ చీల్చారు: సిఎం

ఈ ఎన్నికలు వంచనకు, మోసానికి మధ్య జరిగాయని, ప్రతిపక్షాల ఆల్ ఫ్రీ వాగ్దానాలను ప్రజలు నమ్మలేదని ఆయన అన్నారు. గత ఎన్నికల్లో తెరాస, సిపిఐ, సిపిఎం తమతో ఉన్నాయని, ఈ ఎన్నికల్లో ఆ పార్టీలో తెలుగుదేశం పార్టీతో కలిశాయని, ఆ నాలుగు పార్టీల కన్నా తమకు 1.8 శాతం ఎక్కవ ఓట్లు వచ్చాయని ఆయన చెప్పారు. తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హయాంలో జరిగిన పనికి ఆహార పథకం అమలును, తమ ప్రభుత్వంలో జరిగిన ఉపాధి హామీ పథకం అమలుతో బేరీజు వేయాలని, పనికి ఆహార పథకం తెలుగుదేశం పార్టీ భోజన కార్యక్రమంగా మారిందని, ఉపాధి హామీ పథకం అమలులో తాము ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచామని ఆయన చెప్పారు.
తమ ఐదేళ్ల పాలనను బేరీజు వేసి ప్రజలు తమను ఆశీర్వదించారని, తమను ప్రభుత్వంలో కొనసాగమన్నారని ఆయన చెప్పారు. మరింత జాగ్రత్తగా పని చేయాలని తమకు ప్రజలు పాస్ మార్కులు ఇచ్చారని ఆయన అన్నారు. లోపాలను సరిదిద్దుకుని మరింత మేలైన పాలనను అందించాలని ప్రజలు ఈ తీర్పు ఇచ్చారని ఆయన అన్నారు. మరింత వేగంగా అభివృద్ధి చేయాలని, మరింత ఎక్కువ సంక్షేమ కార్యక్రామాలు కావాలని ప్రజలు కోరుతున్నారని ఆయన అన్నారు. మరింత పారదర్శకంగా ఉండాలని చెప్పారని ఆయన అన్నారు.
తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హయాంలో జరిగిన లోపాలను ఆయన విమర్శించారు. తాము అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ఆయన వివరించారు. తమకు మరో అవకాశం ఇచ్చిన ప్రజలకు రుణపడి ఉంటామని ఆయన చెప్పారు. ఉపాధి హామీ పథకంతో గ్రామీణ నిరుద్యోగం దూరమవుతుందని ఆయన అన్నారు. సమాచార హక్కులో తమ రాష్ట్రమే ప్రథమ స్థానంలో ఉందని ఆయన అన్నారు. ఒక్క ఎకరా పంట కూడా ఎండకుండా చూశామని ఆయన చెప్పారు. రైతు కార్యక్రమాలను కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శరద్ పవార్ కూడా ప్రశంసించారని ఆయన చెప్పారు. చంద్రబాబు ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఆయన గుర్తు చేశారు. ఎక్కడ రైతు ఆత్మహత్య జరిగినా తాము స్పందించామని ఆయన అన్నారు. ముఖ్యమంత్రి సమాధానం సుదీర్ఘంగా సాగింది. ఎన్ని రకాల వాగ్దానాలు చేసిన చంద్రబాబును ప్రజలు విశ్వసించలేదని ఆయన అన్నారు. ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీవారు నగదు బదిలీ పథకం అని బోగస్ ఎటిఎం కార్డులు పంచారని, అలా పంచినవారిని క్రిమినల్ కేసు కింద బుక్ చేయాలని ఆయన అన్నారు.
విశ్వసనీయత అనేది ఒక్క రోజులో రాదని ఆయన చంద్రబాబును సంబోధిస్తూ అన్నారు. చిన్ననాటి నుంచి 55 ఏళ్లుగా ప్రజలు చంద్రబాబును చూస్తున్నారని, చంద్రబాబు చేసిన పనులను కూడా ప్రజలు చూశారని, ఇప్పుడు అకస్మాత్తుగా ఎలా నమ్ముతారని ఆయన అన్నారు. చంద్రబాబు హామీలను నమ్మబోరని బాలకృష్ణ, ఎన్టీఆర్ కూడా అనుకున్నారని, హామీలను అమలు చేయించే బాధ్యత తమదని చెప్పారని ఆయన అన్నారు. విశ్వసనీయత గురించి మాట్లాడే అర్హత చంద్రబాబుకు లేదని ఆయన అన్నారు. చంద్రబాబు 18 గంటలు ఎలా పనిచేశారని, తాను 12 గంటలు మాత్రమే పనిచేస్తున్నానని, చిన్న అబద్ధాలు ఆడడానికి కూడా తనకు మనసొప్పదని, అంత అబద్ధం చంద్రబాబు ఆడారని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications