లెఫ్ట్ నాశనానికి రాఘవులు చిట్కా
కమ్యూనిస్టు పార్టీలను నిర్వీర్యం చేయాలని వైఎస్ నల్గొండ జిల్లా సమీక్షలో ఇచ్చిన పిలుపుపై ఆయన ఈ విధంగా స్పందించారు. పోలీసులను ప్రయోగించి, ఎరలు వేసి గతంలో చాలా మంది ప్రయత్నించారని, తమను నాశనం చేయాలనుకున్నవారే నాశనమైపోయారని అన్నారు. సీపీఎం రాష్ట్ర విస్తృతస్థాయి సమావేశాల సందర్భంగా ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. తక్షణ సమస్యలపై ప్రజల్లోకి వెళతామని, ప్రజలు ఆందోళనకు సిద్ధమైనప్పుడు ఉద్యమాన్ని చేపడతామని వెల్లడించారు. సీపీఐతో సంబంధాలు బ్రహ్మాండంగా ఉంటాయన్నారు. పొరపచ్చాలకు సంబంధించి తమవైపు లోపాలుంటే సరిదిద్దుకుంటామని, సీపీఐ కూడా అలాగే చేస్తుందని ఆశిస్తున్నానని వ్యాఖ్యానించారు.
పశ్చిమ బెంగాల్లో సీపీఎం, వామపక్ష ప్రభుత్వానికి వ్యతిరేకంగా లాల్ఘఢ్ ప్రాంతంలో తృణమూల్ కాంగ్రెస్ వత్తాసుతో మావోయిస్టులు సాగిస్తున్న అమానుష కాండను సీపీఎం రాష్ట్ర విస్తృతస్థాయి సమావేశం తీవ్రంగా ఖండించిందన్నారు. సామ్యవాద సిద్ధాంత నిబద్ధుడు, మహాకవి శ్రీశ్రీ శతజయంతి సభలను రాష్ట్ర వ్యాప్తంగా జరపాలని పిలుపునిచ్చిందని పేర్కొన్నారు. రెండోసారి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రపంచబ్యాంకు విధానాల మేరకే నడుచుకుంటోందని సీపీఎం రాష్ట్ర విస్తృతస్థాయి సమావేశం అభిప్రాయపడింది.