ఉనికి కోసమే వ్యతిరేకత: వైయస్

"చిన్న, సన్న, మోతుబరి రైతులన్న వ్యత్యాసానికి తావులేకుండా నాగలి పట్టిన ప్రతి ఇంటా ఎనలేని ఆనందం, సౌభాగ్యం నింపడమే నా ధ్యేయం. రైతు కోసం ఒకటికి పదిసార్లు ఆలోచించి, నిపుణులతో చర్చించి క్షుణ్నంగా పరిశీలించి సహకార సేద్యం దిశగా అడుగులేశాం. ప్రతి పల్లెకు కనిష్ఠంగా రూ.100 కోట్లు వెచ్చించి ప్రతి చేనుకు నీరు, ప్రతి చేయికీ పని కల్పించడం సహకార సేద్యం ద్వారా జరిగే ఉపకారం. ప్రారంభంలో ఒక్కో జిల్లాలో రెండు గ్రామాల చొప్పున 50 గ్రామాల్లో దాదాపు రూ.5 వేల కోట్ల పెట్టుబడి పెట్టి సహకార సేద్యంతో ఆయా గ్రామాల్లో రెండో హరిత విప్లవానికి నాంది పలుకుతామని" వైఎస్ తన లేఖలో వివరించారు. ఎకరా, అర ఎకరా భూమి ఉన్న వారి ఇబ్బందులన్నీ సహకార సేద్యంతో పరిష్కారమవుతాయని, ఐదేళ్లలో ఏ సంవత్సరం అధిక ఆదాయం వచ్చిందో దాన్ని పరిగణనలోకి తీసుకుని ఏటా రైతుకు ఆ మొత్తం వచ్చేలా చూసే బాధ్యత ప్రభుత్వానిదేనని స్పష్టంచేశారు.
ఒకవేళ సహకార సంఘం నుంచి బయటకు రావాలనుకుంటే ఎలాంటి ఇబ్బందీ లేకుండా పూర్వస్థితికి తీసుకొచ్చే బాధ్యతా సర్కారుదేనని స్పష్టం చేశారు. కుప్పంలో నిర్వహించిన కార్పొరేట్ సేద్యానికి, సహకార సేద్యానికి నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉందన్నారు. రైతు బాగుపడితేనే తన ప్రజా జీవితానికి సార్థకతని, సహకార సేద్యంలో రాష్ట్రం ఆదర్శంగా నిలిచేలా చూడాలని, చేయిచేయి కలపాలని కోరారు.












Click it and Unblock the Notifications