వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జాక్సన్‌ కు ఘనంగా వీడ్కోలు

By Staff
|
Google Oneindia TeluguNews

Michael Jackson
లాస్‌ ఎంజిల్స్‌: మైకేల్‌జాక్సన్‌ అంతిమయాత్ర ముగిసింది. అభిమాన లోకం అతనికి ఘనంగా వీడ్కోలు పలికింది. చరిత్ర గుర్తుంచుకునేలా, చరిత్రలో నిలిచిపోయేలా ఆయననకు నివాళులర్పించింది. 'నా అంత్యక్రియలు ప్రపంచంలోనే పెద్ద వేడుకగా జరగాలి'- ఇది మైఖేల్‌ జాక్సన్‌ ఆకాంక్ష. ఆయన ఆశించిన దానికంటే ఘనంగా ఈ కార్యక్రమం జరిగింది. ఇప్పటిదాకా మీడియా చరిత్రలో ఇదే అతి పెద్ద వార్తా విశేషం. ఈ కార్యక్రమానికి పెట్టిన ఖర్చు 40 లక్షల డాలర్లు. భారత కరెన్సీలో సుమారు 20 కోట్లు. అమెరికా కాలమానం ప్రకారం మంగళవారం ఉదయం మైఖేల్‌ కు అంతిమ వీడ్కోలు పలికే కార్యక్రమం మొదలైంది.

తొలుత శాన్‌ ఫెర్నాండో వ్యాలీలోని మైఖేల్‌ తల్లిదండ్రుల నివాసంలో ఆయన కుటుంబీకులు ప్రత్యేక ప్రార్థనలు జరిపారు. మైఖేల్‌ భౌతిక కాయాన్ని బంగారు రంగు శవపేటికలో ఉంచారు. దానిని ఎర్రరంగు పుష్పాలతో అలంకరించారు. రోల్స్‌ రాయిస్‌, క్యాడిలాక్‌, రేంజ్‌ రోవర్స్‌ కార్లతో కూడిన అంతిమ యాత్ర లాస్‌ ఏంజెలిస్‌ వీధుల గుండా సాగింది. భారత కాలమానం ప్రకారం రాత్రి 11 గంటల సమయంలో ఈ యాత్ర స్టేపిల్స్‌ సెంటర్‌ స్టేడియం చేరుకుంది. అభిమానులు, సన్నిహితులు, హాలీవుడ్‌ నటీనటులతో సహా అనేకానేక మంది ముఖ్యులు అప్పటికే స్టేడియంలో నిండిపోయారు. స్టీవ్‌ వండర్‌, జస్టిన్‌ టింబర్లేక్‌, ఉషర్‌, జెన్నిఫర్‌ హడ్సన్‌, మరియా కేరీ, జాన్‌ మేయర్‌ వంటి పాప్‌ సింగర్లు, మార్టిన్‌ లూథర్‌ కింగ్‌-3, కోబ్‌ బ్రియాంట్‌, బెర్రి గార్డీ, స్మోకీ రాబిన్సన్‌, బ్రూక్‌ షీల్డ్‌ వంటి మహామహులు అక్కడికి తరలి వచ్చారు.

మైఖేల్‌ ముగ్గురు పిల్లలు, ఆయన కుటుంబ సభ్యులు కూడా అక్కడే ఉన్నారు. సంసర్మణ వేదిక ముందు మైఖేల్‌ శవపేటికను ఉంచారు. మరియా కేరీతో సహా పలువురు ప్రముఖ గాయకులు మైఖేల్‌కు తమ పాటలతో నివాళులర్పించారు. మరికొందరు మైఖేల్‌తో తమ స్మృతులను భావేద్వేగంతో పంచుకున్నారు. వేదిక వెనుక భారీగా ఉన్న తెరపై చిన్నప్పటి మైఖేల్‌ నుంచి నిన్న మొన్నటి మైఖేల్‌ దాకా ఆయన జీవితంలోని వివిధ ఘట్టాలను గుర్తు చేసే చిత్రాలను మార్చి మార్చి ప్రదర్శించారు. ఈ సంస్మరణ సభ అత్యంత ఉద్విగ్న భరితంగా సాగింది. ఈ కార్యక్రమాన్ని ప్రత్యక్షంగా 20వేల మంది చూశారు. ప్రపంచవ్యాప్తంగా సుమారు వంద కోట్ల మంది టీవీల్లో ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించారు.

మైఖేల్‌కు 'కింగ్‌ ఆఫ్‌ పాప్‌' అనే బిరుదుతో పట్టాభిషేకం చేసిన ఆయన స్నేహితురాలు, నటి ఎలిజబెత్‌ టేలర్‌, ఆయన రెండో భార్య డెబ్బీరో ఈ కార్యక్రమానికి హాజరు కాలేదు. "మైఖేల్‌ లేని బాధ నన్ను కలచివేస్తోంది. ఇది బహిరంగంగా అందరితో పంచుకునేది కాదు. నా వ్యక్తిగతం' అని టేలర్‌ ఓ ప్రకటన విడుదల చేశారు. "ఈ కార్యక్రమం మొత్తం మైఖేల్‌కు అంకితం కావాలి. నేను అక్కడికి వచ్చి అనవసరమైన ఆకర్షణగా మారదలచుకోలేదు" అని డెబ్బీ రో చెప్పారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X