కిడ్నాప్ అయిన చిన్నారి దారుణ హత్య
తుంగభద్రమ్మ చేసిన వరద గాయం నుంచి ఇప్పుడిప్పుడే తేరుకుంటున్న గ్రామంలో ఈ ఘోరం మరోసారి విషాదాన్ని నింపింది. వివరాల్లో వెళితే .. నందవరం మండలం నదికైరవాడి గ్రామానికి చెందిన గొల్ల పార్వతి, రాముడుల మూడేళ్ల కూతురు మాదేవి (మహాదేవి) శుక్రవారం ఉదయం అదృశ్యమయింది. చిన్నారి కోసం నదికైరవాడి, కొత్త కైరవాడి గ్రామలతో పాటు పరిసర పంట పొలాల్లో గాలించినా ఆచూకీ లభించకపోవడంతో వారు నందవరం పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు రంగంలోకి దిగి పరిసర గ్రామాల్లో విచారించారు. ఆదివారం గ్రామశివార్లలో పడిఉన్న ఒక మూట దుర్గంధం వెదజల్లుతుండటంతో అటుగా వెలుతున్న గొర్రెల కాపరి దానిని గుర్తించి గ్రామప్తులకు సమాచారం అందించారు.
దీంతో గ్రామస్తులు అక్కడి చేరుకుని మూటను విప్పిచూడగా చిన్నారి మాదేవి మృతదేహం కనిపించింది. గొంతుకు తాడుతో బిగించి మాదేవిని కిరాతకంగా హత్య చేసినట్లు తెలుస్తోంది. నందవరం సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఎమ్మిగనూరుకు తరలించారు. తుంగభద్ర వరదల్లో తమ కుటుంబం మొత్తం పోయి ఉంటే బాగుండేదని తమకు ఈ కడుపుకోత మిగిలేది కాదని చిన్నారి తల్లిదండ్రులు కన్నీరు మున్నీరయ్యారు.
కిడ్నాప్,చిన్నారి దారుణ హత్యపై జిల్లా ఎస్పీ శ్రీకాంత్ సీరియస్గా పరిగణించారు. హత్య కేసు మిస్టరీని ఛేదించేందుకు పోలీసులు వ్యూహాత్మకంగా వ్యవహరించాలని సూచించారు.