శశిధరూర్ పై ఈ సాయంత్రమే నిర్ణయం?
ఉద్వాసనో, రాజీనామానో రెండింటిలో ఏదో ఒకటి ఖాయంగా కనిపిస్తోంది. విదేశీ పర్యటన నుంచి తిరిగొచ్చిన ప్రధానితో శనివారం సాయంత్రం సోనియా సమావేశమవుతారని, ఆ తర్వాత నిర్ణయం వెలువడుతుందని భావించారు. కానీ సమావేశం వాయిదా పడింది. సోమవారం వారిద్దరి భేటీ ఉండొచ్చని తెలిసింది. ఈ విషయంలో తుది నిర్ణయాన్ని సోనియా ప్రధానికే వదిలేసినట్లు పార్టీ వర్గాలు చెప్పాయి.
ప్రధాని అన్నీ సావధానంగా ఆలోచించి నిర్ణయం తీసుకుంటారని కాంగ్రెస్ అధికార ప్రతినిధి అభిషేక్ సింఘ్వీ చెప్పారు. ఈ వివాదంపై పార్లమెంట్లో చెలరేగిన రగడపై మన్మోహన్ పెద్దగా ఆందోళన చెందినట్లు కనిపించలేదు. "రాజకీయాల్లో ఎత్తు పల్లాలు సహజమే" అని ప్రత్యేక విమానంలో అన్నారు. థరూర్కు ఉద్వాసన ఖాయమని ఇప్పటికీ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఆయన చేతే రాజీనామా చేయించాలని అధిష్ఠానం ఆలోచనగా ఉన్నట్లు తెలుస్తోంది. శశిథరూర్కు ఉద్వాసన పలకాలని భాజపా నేత ఎల్.కె.అద్వానీ శనివారం ప్రధాని మన్మోహన్ సింగ్ను డిమాండ్ చేశారు.