కెవిపి రాయబారాలపై దేవినేని నిప్పులు
రెండు వేర్వేరు వ్యవహారాల్లో సునందా పుష్కర్, నీరా రాడియాల జోక్యంపై మీడియాలో వచ్చిన కథనాలను బట్టి కేంద్ర ప్రభుత్వ విధానాల్లో దళారుల పాత్ర రుజువైందని శనివారం ఇక్కడ పాత్రికేయులతో మాట్లాడిన ఉమామహేశ్వరరావు ఆరోపించారు. రాష్ట్రంలో ఆరేళ్ల కాంగ్రెసు పార్టీ పాలన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలోను, ప్రస్తుత ముఖ్యమంత్రి కె రోశయ్య హయాంలోను రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు, రాజ్యసభ సభ్యుడు కెవిపి రామచంద్రరావు నిర్దేశకాల మేరకే జరుగుతున్నదని అన్నారు.
రామచంద్రరావు సూచనల కింద రాష్ట్ర ప్రభుత్వం భారీఎత్తున అవినీతిలో కూరుకుపోయిందన్నారు. రాజా, శశిథరూర్ పై వచ్చిన అవినీతి ఆరోపణలపై సంయుక్త పార్లమెంటరీ కమిటీ ఏర్పాటు చెయ్యాలన్నారు. హైకోర్ట్ ప్రస్తుత న్యాయమూర్తితో రాష్ట్ర స్థాయిలో జరుగుతున్న అవినీతిపై విచారణ జరిపించాలని ఉమామహేశ్వరరావు కోరారు.
స్పెక్ట్రమ్ కేటాయింపులో అవినీతికి సంబంధించి పలు ఆరోపణలను మీడియాలో ప్రస్తావిస్తున్నప్పటికీ యుపిఎ ఛైర్పర్శన్ సోనియాగాంధీ, ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ మౌనంగా ఉండటంపై ఆయన విమర్శలు గుప్పించారు. ప్రభుత్వం కుప్పకూలకుండా కాపాడుకునేందుకే కాంగ్రెసు పార్టీ మౌనంగా ఉందని ఆయన అన్నారు.