ఎపికి ప్రపంచస్థాయి గుర్తింపు: సిఎం
ఇంతవరకు దేశ రాజధాని న్యూఢిల్లీకి మాత్రమే పరిమితమైన ఆటోషో హైదరాబాద్లో అడుగు పెట్టింది. ఢిల్లీ వెలుపల జాతీయ స్థాయిలో జరుగుతున్న తొలి ప్రాంతీయ ఆటో షో ఇది. భారత పరిశ్రమల సమాఖ్య (సిఐఐ) ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ రవాణా శాఖ, భారత ఆటోమొబైల్ ఉత్పత్తిదారుల సంఘం (సియామ్), ఆటోమొబైల్ విడిభాగాల ఉత్పత్తిదారుల సంఘం (ఆక్మా), భారత ఆటోమొబైల్ డీలర్ల సమాఖ్య (ఫాదా) సహకారంతో ఈ ఆటోషో నిర్వహిస్తోంది. టయోటా కిర్లోస్కర్ మోటార్స్, టీవీఎస్ మోటార్స్, హోండా మోటార్ సైకిల్స్ అండ్ స్కూటర్స్ ఇండియా, టాటా మోటార్స్, జనరల్ మోటార్స్, స్కోడా, ఫియట్ ఇండియా లిమిటెడ్, మహీంద్రా అండ్ మహీంద్రా, యమహా వంటి జాతీయ, అంతర్జాతీయ ఆటోమొబైల్ ఉత్పత్తిదారులతో పాటు ఆటో విడిభాగాల ఉత్పత్తిదారులు ఈ ఆటోషోలో పాల్గొంటున్నారు. ఇరవైకి పైగా కంపెనీలు పాల్గొంటున్న ఈ ఆటోషోలో దేశంలోనే అతి పెద్ద కార్ల ఉత్పత్తి కంపెనీ మారుతి సుజుకీ, టూ వీలర్ కంపెనీ బజాజ్ ఇండియా పాల్గొనకపోవడం లోటుగానే చెప్పాలి. స్కోడా కంపెనీ ఇటీవల తాము మార్కెట్లో విడుదల చేసిన సూపర్బ్ 1.8 మాన్యువల్ ట్రాన్స్మిషన్ కారును మహావీర్ ఆటో స్టాల్లో ప్రదర్శనకు ఉంచింది.