వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

లంచాలు అలవాటు చేసింది ఆంధ్రావాళ్లే: కె చంద్రశేఖర రావు

By Srinivas
|
Google Oneindia TeluguNews

KCR
హైదరాబాద్‌: ప్రభుత్వ కార్యాలయాల్లో పనులు చేస్తే లంచాలు తీసుకోవడం అలవాటు చేసింది ఆంధ్రా అధికారులేనని తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖరరావు విమర్శించారు. పని చేసి పెట్టి పైసలు తీసుకోవడం తెలంగాణలో లేదని, అది అలవాటు చేసింది ఆంధ్రావాళ్లేనని ఆయన అన్నారు. విద్యుత్‌ శాఖలో జూనియర్‌ లైన్‌మెన్లుగా ఎంపికైన వారికి పది రోజుల్లోగా నియామక ఉత్తర్వులివ్వాలని, లేకుంటే ముఖ్యమంత్రితో యుద్ధానికి దిగుతామని తెరాస అధినేత కె.చంద్రశేఖరావు హెచ్చరించారు. ఈ దిశగా హైకోర్టు ఇచ్చిన ఆదేశాల్ని సీమాంధ్రలో అమలుచేసిన ప్రభుత్వం తెలంగాణలో మాత్రం ఖాళీల భర్తీని పట్టించుకోలేదని ధ్వజమెత్తారు. శనివారం నాడిక్కడ టీఎన్‌జీఓ భవన్‌లో జరిగిన విద్యుత్‌ ఉద్యోగుల సమావేశంలో కేసీఆర్‌, తెలంగాణ ఐకాస ఛైర్మన్‌ ప్రొఫెసర్‌ కోదండరామ్‌ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈనెల 29న నగరంలోని ఎగ్జిబిషన్‌ మైదానంలో జరగనున్న హైదరాబాద్‌ స్టేట్‌ ఎలక్ట్రిసిటీ డిపార్ట్‌మెంట్‌ శతాబ్ది ఉత్సవాల గోడ పత్రికలను వారు ఆవిష్కరించారు.

తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా తిరుగుతున్న శ్రీనివాస్‌గౌడ్‌ను బదిలీ చేయాలని ఓ ఎమ్మెల్యే అడిగితే బదిలీ చేసేస్తారా? అని కెసిఆర్ ప్రశ్నించారు. ప్రభుత్వం ఈ తరహా కక్ష సాధింపును విడనాడాలని కోరారు. హైదరాబాద్‌ రాష్ట్ర విద్యుత్‌ శాఖ శతాబ్ది ఉత్సవాల రోజున ప్రభుత్వ సెలవు దినం ఇస్తే తప్పేంటని ప్రశ్నించారు. ఒంటరిగా ఉంటే దెబ్బ తీస్తారని చెబుతూ, సంఘటితంగా ఉండాలని, ఐక్యతే శ్రీరామరక్ష అని విద్యుత్‌ ఉద్యోగులకు పిలుపునిచ్చారు. నవంబరులో రామబాణం లాంటి తెలంగాణ పత్రికను తీసుకువస్తున్నామని కేసీఆర్‌ వెల్లడించారు. హైదరాబాద్‌ను తాము అభివృద్ధి చేశామని సీమాంధ్రులు చెబుతున్నారని, వారి కంటే ముందే నిజాం హయాంలోనే తెలంగాణలో విద్యుత్‌ సౌకర్యం వచ్చిందన్నారు.

కోదండరామ్‌ మాట్లాడుతూ విద్యుత్‌ రంగాన్ని వాణిజ్యానికి వాడుకుని నాశనం చేశారని దుయ్యబట్టారు. ప్రభుత్వానికి ప్రజల పక్షాన ఉండటం ఇష్టంలేదని, అందుకే తెలంగాణ ఉద్యోగులను వేధింపులకు గురిచేస్తుందని ఆరోపించారు. టీఎన్‌జీఓ అధ్యక్షుడు కె.స్వామిగౌడ్‌ మాట్లాడుతూ రూ.60 వేల కోట్లను మాయం చేసిన 'ఎమ్మార్‌ ప్రాపర్టీస్‌' దొంగల ముఠాను వదిలేసి.. తెలంగాణ ఉద్యోగులను అణచివేసేందుకు ప్రయత్నిస్తే సహించబోమన్నారు. తెలంగాణ విద్యుత్తు ఉద్యోగుల ఐకాస(టీ జాక్‌) అధ్యక్షుడు రఘు అధ్యక్షతన జరిగిన సమావేశంలో తెలంగాణ గెజిటెడ్‌ అధికారుల సంఘం అధ్యక్షుడు వి.శ్రీనివాస్‌గౌడ్‌, ఆర్‌టీసీ ఐకాస నేత ఆనందం తదితరులు పాల్గొన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X