అసెంబ్లీ స్పీకర్: ఉత్తమ్ కుమార్ రెడ్డా, నాదెండ్ల మనోహరా?

Uttam Kumar Reddy
న్యూఢిల్లీ‌:శాసనసభ స్పీకర్ పదవి ప్రస్తుతం డిప్యూటీ స్పీకర్ గా ఉన్న నాదెండ్ల మనోహర్ కు దక్కుతుందా, నల్లగొండ జిల్లా శాసనసభ్యుడు ఉత్తమ్ కుమార్ రెడ్డికి దక్కుతుందా అనే చర్చ సాగుతోంది. డిసెంబరు పదినుంచి శాసనసభ శీతాకాల సమావేశాలు ప్రారంభం కానున్నా స్పీకర్‌ పదవి ఎవరికిస్తారనేది ఇంకా తేలలేదు. ఇది కూడా పీసీసీ, ఉపముఖ్యమంత్రి పదవులతో ముడిపడింది. మంత్రివర్గంలో స్థానం కోసం పోటీపడ్డ నల్గొండ జిల్లా ఎమ్మెల్యే ఉత్తమ్‌ కుమార్‌రెడ్డికి ఏదో ఒక పదవి కేటాయించడం ఖాయమని అంటున్నారు. ఆయన సీఎంతో సన్నిహితంగా ఉంటున్నారు. తొలుత ఆయన్ను చీఫ్‌విప్‌గా తీసుకుంటారని భావించారు. ప్రస్తుతం చీఫ్‌విప్‌గా ఉన్న మల్లు భట్టి విక్రమార్కకు మంత్రివర్గంలో స్థానం లభించకపోవడంతో ఇక ఉత్తమ్‌కు ఆ అవకాశం లేనట్లేనని భావించారు. డిప్యూటీ స్పీకర్‌గా ఉన్న నాదెండ్ల మనోహర్‌నే స్పీకర్‌ ను చేస్తే మంచిదనే భావన ముఖ్యనేతల్లో ఉంది. ఆయన ప్రస్తుతం శాసనసభలో సమర్థంగా వ్యవహరిస్తున్నారనే విషయంలో కాంగ్రెస్‌లో ఎవరికీ భిన్నాభిప్రాయం లేదు.

మంత్రివర్గం ఎంపిక జరిగిన రాత్రి ఉత్తమ్‌ తన సన్నిహితులకు తాను అయిష్టంగానే చీఫ్‌విప్‌ పదవికి అంగీకరించానని అన్నట్లు సమాచారం. అదే నిజమైతే ప్రస్తుత చీఫ్‌విప్‌ మల్లు భట్టి విక్రమార్కను డిప్యూటీ స్పీకర్‌ను చేసి మనోహర్‌కు స్పీకర్‌ గా పదోన్నతి కల్పిస్తారని అంటున్నారు. ఎస్సీలో మాదిగ వర్గానికి చెందిన దామోదర్‌కు ఉప ముఖ్యమంత్రి ఇచ్చేపక్షంలో తెలంగాణలో మాల వర్గానికి చెందిన భట్టి విక్రమార్కకు ఈ పదవి ఇవ్వడం ద్వారా సమతౌల్యం సాధించినట్లవుతుందని చెబుతున్నారు. ఒక వేళ భట్టిని చీఫ్‌విప్‌గానే కొనసాగించే పక్షంలో ఉత్తమ్‌, మనోహర్‌ల మధ్య స్పీకర్‌ పదవి విషయంలో పోటీ తప్పదు. మనోహర్‌కంటే ఉత్తమ్‌ సీనియర్‌ శాసనసభ్యులు. అయితే ఒక సామాజిక వర్గానికి ఎక్కువ మంత్రి పదవులివ్వడమే కాకుండా 11 కీలకమైన శాఖల్లో 8 వారికే కేటాయించారనే ఆరోపణల నేపథ్యంలో ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి స్పీకర్‌ పదవి కష్టం కావచ్చునంటున్నారు. తన పదవి విషయంలో కొంత గందరగోళం నెలకొనడంతో మల్లు భట్టి విక్రమార్క రెండురోజులుగా ఢిల్లీలో మకాం వేసి నేతలను కలుస్తున్నారు. స్పీకర్‌, డిప్యూటీ స్పీకర్‌ పదవుల్లో ఏదో ఒకదానికి తన పేరును పరిగణనలోకి తీసుకోవాలని ఆయన ప్రయత్నాలు చేసుకుంటున్నట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం కేబినెట్‌ లో బలహీనవర్గాలకు అన్యాయం జరిగిందన్న వాదన బలంగా వినిపిస్తున్న సమయంలో స్పీకర్‌ పదవి అగ్రవర్ణేతరులకు ఇస్తారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలోనే ఆయన ఢిల్లీలో ప్రయత్నాలు నెరపుతున్నట్టు సమాచారం. కొత్త పదవి దక్కకపోతే కనీసం ఇప్పుడున్న చీఫ్‌విప్‌ హోదాయైునా చేజారకుండా చూసుకొనే పనిలో ఉన్నట్టూ తెలుస్తోంది. ఈ మూడు ప్రధాన పదవులపై నెలకొన్న గందరగోళం ఇంకొంత కాలం కొనసాగే వాతావరణమే కనిపిస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+