వైయస్ జగన్పై వ్యాఖ్యలకు కిరణ్ కుమార్ రెడ్డిపై సబ్బం హరి ధ్వజం
వైయస్ రాజశేఖర రెడ్డి వల్లనే కిరణ్ కుమార్ రెడ్డి ఆనాడు శాసనసభ స్పీకర్ అయ్యారని, దానివల్లనే ఇప్పుడు ముఖ్యమంత్రి అయ్యారని ఆయన అన్నారు. కిరణ్ కుమార్ రెడ్డిని స్పీకర్గా ఎంపిక చేయడాన్ని ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడు తీవ్రంగా వ్యతిరేకించినా, ప్రజాస్వామ్య నియమాలను పాటించడానికి కూడా సిద్ధపడినా వైయస్ వెనక్కి తగ్గలేదని ఆయన అన్నారు. వైయస్ రాజశేఖర రెడ్డి దొంగనా, అవినీతిపరుడా ముందు చెప్పాలని, అలా అయితే వైయస్ వారసత్వాన్ని ఎలా అంగీకరిస్తున్నారని ఆయన అన్నారు. ఓ వైపు వైయస్ను కించపరుస్తూనే మరో వైపు వైయస్ వారసులమని చెప్పుకోవడం సరి కాదని ఆయన అన్నారు.
వైయస్ జగన్ ఆస్తులపై సిబిఐ విచారణకు ఆదేశిస్తే తమకు అభ్యంతరం లేదని, ముఖ్యమంత్రి గానీ ప్రధాని గానీ చొరవ చూపి సిబిఐ విచారణ జరిగేలా చర్యలు తీసుకోవచ్చునని ఆయన అన్నారు. ఓ రాజకీయ నాయకుడు చేసిన ఆరోపణలను హైకోర్టు సుమోటాగా విచారణకు స్వీకరించి నోటీసులు జారీ చేయడం కూడా అనుమానాలకు తావిస్తోందని ఆయన అన్నారు. అలా అయితే రాజకీయ నాయకులు చేస్తున్న ప్రతి ఆరోపణపై ఆలా చేయాల్సి ఉంటుందని ఆయన అన్నారు. హైకోర్టు నోటీసులు జారీ చేయడంలో కొంత మంది కుట్ర ఉందనే అనుమానాలున్నాయని ఆయన అన్నారు.