తగ్గిన వైయస్ జగన్ బలం, హరిత యాత్రకు 11 మంది ఎమ్మెల్యేలే
ఈ హరిత యాత్రలో శాసనసభ్యులు అమర్నాథ్ రెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, శ్రీనివాసులు, పిల్లి సుభాష్ చంద్రబోస్, మేకపాటి చంద్రశేఖర రెడ్డి, కొండా సురేఖ, శివప్రసాద్ రెడ్డి, ద్వారంపూడి చంద్రశేఖర రెడ్డి, బాబూరావు తదితరులు పాల్గొన్నారు. పార్లమెంటు సభ్యుడు మేకపాటి రాజమోహన్ రెడ్డి, మాజీ రాష్ట్ర మంత్రి కొణతాల రామకృష్ణ కూడా ఈ యాత్రలో పాల్గొన్నారు. స్వర్గీయ ఎన్టీ రామారావు సతీమణి లక్ష్మీపార్వతి కూడా యాత్ర ప్రారంభ కార్యక్రమానికి వచ్చారు. ఎమ్మెల్సీలు పుల్లా పద్మావతి, జూపూడి ప్రభాకర రావు, అంబటి రాంబాబు తదితరులు పాల్గొన్నారు. దివంగత నేత వైయస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి వైయస్ జగన్ పూలమాల వేసి హరిత యాత్ర ప్రారంభ వేదిక మీదికి చేరుకున్నారు.
మాజీ మంత్రి, శాసనసభ్యుడు బాలినేని శ్రీనివాస రెడ్డి కూడా రాలేదు. అయితే, అనివార్య కారణాల వల్ల మాత్రమే ఆయన రాకపోవచ్చునని భావిస్తున్నారు. శాసనసభ్యుడు బాలరాజు మాత్రం పోలవరం వద్ద ఈ నెల 10వ తేదీన పోలవరం వద్ద జరిగే బహిరంగ సభకు ఏర్పాట్లు చేస్తున్నారు. విజయవాడలో జరిగిన లక్ష్యదీక్షకు దాదాపు 26 మంది శాసనసభ్యులు హాజరైతే, ఢిల్లీ జలదీక్షకు 21 మంది మాత్రమే హాజరయ్యారు. ఈ సంఖ్య ఇప్పుడు 11కు తగ్గింది. అయితే, కొంత మంది ఈ నెల 10వ తేదీ లోగా వచ్చి జగన్కు మద్దతిచ్చి వెళ్లవచ్చునని భావిస్తున్నారు. శాసససభ్యుల సంఖ్య తగ్గినా జగన్ వెంట ప్రజలున్నారని ఎమ్మెల్యే సంఖ్య తగ్గడంపై వైయస్ జగన్ వర్గానికి చెందిన నాయకులంటున్నారు.