ఎమ్మెల్సీ ఎన్నికల్లో వోటింగ్పై జగన్ వర్గం ఎమ్మెల్యేల్లో విభేదాలు
తాము వోటింగులో పాల్గొంటామని శాసనసభ్యుడు పిల్లి సుభాష్ చంద్రబోస్ చెప్పారు. తాము ఎవరికి వోటు వేస్తామనే విషయాన్ని వెల్లడించాల్సిన అవసరం లేదని ఆయన అభిప్రాపడ్డారు. ఆత్మప్రబోధానుసారం ఓటు వేస్తామని ఆయన చెప్పారు. దీన్ని బట్టి ఓటింగ్ విషయంలో వారి మధ్య ఏకాభిప్రాయం కుదలేదని అర్థం చేసుకోవచ్చు. ఎవరికి ఓటు వేయాలనే విషయం జగన్ తనకు చెప్పలేదని, తాము ఆత్మప్రబోధానుసారం ఓటు వేస్తామని మేకపాటి చంద్రశేఖర రెడ్డి కూడా చెప్పారు. దీన్ని బట్టి వారు కాంగ్రెసు పార్టీ అభ్యర్థులకు ఓటు వేసే అవకాశాలు తక్కువే ఉన్నట్లు తెలుస్తోంది.
కాగా, ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ గురువారం ఉదయం 9 గంటలకు ప్రారంభమైంది. ఇది సాయంత్రం ఐదు గంటల వరకు కొనసాగుతుంది. జగన్ వర్గానికి చెందిన ఆళ్ల నాని, భారిత, ప్రసాద రాజు, అశోక్ బాబు ఉదయమే వోటు వేశారు. అధికార కాంగ్రెసు పార్టీ నాలుగో ప్రాధాన్యతా వోటును సిపిఐ అభ్యర్థికి కేటాయించింది. తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అభ్యర్థికి ఓట్లు పడకుండా నిరోధించడానికి కాంగ్రెసు ఆ కేటాయింపు జరిపినట్లు తెలుస్తోంది.