లాడెన్పై దాడితో మాకు ప్రత్యక్ష సంబంధం లేదు: పాకిస్తాన్ ప్రభుత్వ ప్రకటన
ఒసామా బిన్ లాడెన్ను తమ ఆపరేషన్లో చంపినట్లు అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా ఫోన్ చేసి చెప్పారని ఆ ప్రకటనలో తెలిపారు. పాకిస్తాన్తో పాటు అంతర్జాతీయ సమాజం ఉగ్రవాదాన్ని నిర్మూలించాల్సిన అవసరాన్ని లాడెన్ మృతి తెలియజేస్తోందని ప్రకటించింది. ఈ సంఘటన ప్రపంచవ్యాప్తంగా ఉగ్రవాదానికి ఎదురు దెబ్బ అని వ్యాఖ్యానించింది. పాకిస్తాన్పై లాడెన్ యుద్ధం ప్రకటించాడని, ఆల్ ఖైదా విచక్షణారహితమైన దాడుల్లో పాకిస్తాన్కు చెందిన వేలాది మంది ఆమాయక ప్రజలు, మహిళలు, పిల్లలు మరణించారని చెప్పింది.
గత కొన్నేళ్లలో ఉగ్రవాదుల దాడిలో 30 వేల మంది పాకిస్తానీ పౌరులు మరణించినట్లు తెలిపింది. దాదాపు 5వేల మంది భద్రతాధికారులు, సైనికులు అమరులయ్యారని చెప్పింది. ఉగ్రవాదాన్ని అంతం చేయడంలో పాకిస్తాన్ సమర్థవంతమైన పాత్రను పోషించిందని సమర్థించుకుంది. తమ భూభాగంలో ఉగ్రవాద చర్యలను అనుమతించబోమని స్పష్టం చేసింది.