జగన్ క్యాంప్ ఎమ్మెల్యేలపై సిఎం నిప్పులు: వెళ్తే వెళ్లండంటూ హెచ్చరిక

బుధవారం రాత్రి శ్రీకాకుళంలోని ఇందిరా విజ్ఞాన్ భవన్లో జరిగిన జిల్లా కాంగ్రెస్ పార్టీ సర్వసభ్య సమావేశంలో కిరణ్ పాల్గొన్నారు. "ఇంటి దొంగలను ఈశ్వరుడైనా పట్టుకోలేడంటారు. ఇలాంటి ఇంటి దొంగలు ముందు పంపించేయాలి. అప్పుడే పార్టీ బలంగా ఉంటుంది. మన పార్టీలో నాయకులు, కార్యకర్తలకు కొదవేమీ లేదు. పార్టీ వదిలి వెళ్లాలనుకుంటున్న వారికి దండం పెట్టి చెబుతున్నా! ప్లీజ్... వెళ్లిపోండి. మీతో మాకు అవసరంలేదు. పార్టీవల్ల పదవులు పొంది, ఇతర పార్టీలతో జట కట్టిన వారు పౌరుషం ఉంటే రాజీనామా చేసి వెళ్లిపోండి. పౌరుషం లేదంటే... మర్యాదగా పార్టీలో ఉండండి. మర్యాద తప్పితే మాత్రం... ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచుతాం!'' అని సూటిగా హెచ్చరించారు.
"వైఎస్ రెండుసార్లు ముఖ్యమంత్రి అయ్యారంటే అది సోనియాగాంధీ దయ వల్లనే. కాంగ్రెస్లో కష్టపడే వారికి ఏనాటికైనా గుర్తింపు లభిస్తుందనడానికి తనకు ముఖ్యమంత్రి పదవి దక్కడమే ఒక ఉదాహరణ. వైఎస్ ఏనాడూ సోనియాను విమర్శించలేదు. పార్టీ పట్ల ఆయన అంకితభావం అనితర సాధ్యం'' అని కిరణ్ తెలిపారు. తన రాజకీయ జీవితంలో ఒకే ఒకసారి పార్టీకి వ్యతిరేకంగా పని చేశానని, అందుకు తగిన మూల్యం కూడా చెల్లించుకున్నానని సీఎల్పీ సమావేశంలోనే వైఎస్ చెప్పారని గుర్తు చేశారు.












Click it and Unblock the Notifications