దిగొచ్చిన యడ్యూరప్ప, సిఎం పదవికి రాజీనామా
బళ్లారి సోదరులు కూడా యడ్యూరప్పకు మద్దతివ్వలేదు. ప్లేటు ఫిరాయించి, యడ్యూరప్ప బిజెపి అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి ఉండాల్సిందేనని మంత్రులు గాలి జనార్దన్ రెడ్డి, గాలి కరుణాకర్ రెడ్డి, శ్రీరాములు చెప్పారు. దీంతో యడ్యూరప్ప దిగి వచ్చారు. యడ్యూరప్ప స్థానంలో కొత్త నేతను ఎంపిక చేసేందుకు పార్టీ ప్రతినిధులు బెంగళూర్ వస్తున్నారు. రేపు శుక్రవారం బిజెపి శాసనసభా పక్షం సమావేశమై కొత్త నేతను ఎన్నుకుంటారు. కాగా, ముఖ్యమంత్రి పదవి కోసం ఆరుగురు నేతలు పోటీ పడుతున్నారు.
గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి జగదీష్ షెట్టర్, కర్ణాటక బిజెపి అధ్యక్షుడు ఈశ్వరప్ప, మాజీ బిజెపి అధ్యక్షుడు సందానంద గౌడ, అనంతకుమార్, మాజీ హోం మంత్రి విఎస్ ఆచార్య, న్యాయ శాఖ మంత్రి సురేష్ కుమార్, శోభా కరండ్లజే ముఖ్యమంత్రి పదవి కోసం పోటీ పడుతున్నారు. సదానంద గౌడను యడ్యూరప్ప సమర్థిస్తున్నట్లు సమాచారం. కాగా, శోభా కరండ్లజె యడ్యూరప్పకు సన్నిహితురాలు. జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన అనంత కుమార్ యడ్యూరప్ప ప్రత్యర్థి. తెర వెనక యడ్యూరప్పకు వ్యతిరేకంగా ఆయనే పనిచేశారనే ప్రచారం ఉంది.
యడ్యూరప్పను పదవి నుంచి తప్పించేందుకు బిజెపి అధిష్టానం తీవ్రంగా ప్రయత్నాలు సాగించింది. అక్రమ మైనింగ్ వ్యవహారంలో లోకాయుక్త తప్పు పట్టిన నేపథ్యంలో ముఖ్యమంత్రి పదవి నుంచి దిగిపోవాల్సిందేనని బిజెపి కేంద్ర నాయకత్వం యడ్యూరప్పను ఆదేశించింది. యడ్యూరప్ప పార్టీ నిర్ణయానికి కట్టుబడాలని బిజెపి అధికార ప్రితినిధి రవిశంకర్ ప్రసాద్ మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. కేంద్ర నాయకత్వంపై తిరుగుబాటుకు యడ్యూరప్ప ప్రయత్నాలు చేస్తున్నారంటూ వార్తలు వచ్చాయి. అయితే, పరిణామాలను, పరిస్థితిని బేరీజు వేసుకున్న యడ్యూరప్ప పార్టీ కేంద్ర నాయకత్వం నిర్ణయాన్ని శిరసావహించడమే మంచిదనే భావనకు వచ్చారు.