కాంగ్రెసు కాళ్లు మొక్కేందుకే జగన్ ఇంగ్లీషు: రేవంత్ రెడ్డి
మంత్రులను బెదిరించి, మంత్రులకు అబద్దాలు చెప్పి, వారికి తెలియకుండా ఇలా మూడు పద్ధతుల్లో దోచుకున్నారని ఆరోపించారు. వైయస్ హయాంలో జలయజ్ఞం ధనయజ్ఞంగా మారిన విషయం జగన్కు తెలియదా అని ప్రశ్నించారు. మంత్రివర్గానికి తెలియకుండా వైయస్ అనేక నిర్ణయాలు తీసుకున్నారని అన్నారు. జె గ్యాంగ్ ఆంధ్రప్రదేశ్, కర్నాటక రాష్ట్రాలలో దోచుకున్న విషయం జగన్కు తెలియదా అన్నారు. 2007 నుంచే వైయస్, జగన్ అవినీతిని రాష్ట్రపతి వరకు తెలుగుదేశం పార్టీ ఫిర్యాదు చేసిందని అన్నారు. మీ కుటుంబం రాష్ట్రాన్ని దోచుకుంటుందనే అవిశ్వాస తీర్మానం పెట్టామని అన్నారు. వ్యక్తులు చనిపోతే చేసిన తప్పులు వదిలేయాలని జగన్ చెప్పడం హాస్యాస్పదం అన్నారు.
వైయస్ చనిపోయిన విషయాన్ని చెప్పి జగన్ తప్పించుకునే ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. మమ్మల్నే కాకుండా వైయస్ హయాంలోని మంత్రి వర్గాన్ని సైతం విచారించాలని జగన్ సిబిఐకి లేఖ రాయాలని ఆయన సూచించారు. మేం సంపాదించిన దాంట్లో వాటాలు ఇచ్చిన వారందరినీ జైలులో పెట్టాలని జగన్ చెబితే చాలా మంచిందన్నారు. అప్పుడు అవినీతిపరులు అంతా జైలుకు వెళతారని అన్నారు. జగన్కు ఎసిబి కోర్టుకు, సిబిఐ కోర్టుకు తేడా తెలియకుండా తమ పార్టీ అధినేత చంద్రబాబుపై మాట్లాడుతున్నట్టుగా కనిపిస్తోందని అన్నారు. చంద్రబాబుపై వైయస్ 40 విచారణలు చేయించి ఏమీ లేవని తేల్చిన విషయం జగన్కు గుర్తుకు లేదా అన్నారు.