కోదండరామ్ 'రెడ్డి'ని కడిగేసిన ఎర్రబెల్లి, ద్రోహిగా వ్యాఖ్య

తెలంగాణ ఇస్తామని, తెస్తామని తాము చెప్పలేదని, కాంగ్రెసు పార్టీయే ఆ మాటలు చెప్పిందని, తాము అధికారంలోకి వస్తే తెలంగాణ తీర్మానం చేస్తామని హామీ ఇచ్చామని, తెలంగాణకు అనుకూలంగా తమ పార్టీ లేఖ ఇచ్చిందని, దానికి తాము కట్టుబడి ఉన్నామని ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. కోదండరామ్ రెడ్డి కాంగ్రెసును, తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస)ను బలోపేతం చేయడానికి ప్రయత్నించారని ఆయన అన్నారు. తెలంగాణను కాంగ్రెసు, తెరాస, కోదండరామ్ రెడ్డి మోసం చేసినట్లు ఆయన ఆరోపించారు. తెలంగాణ పేరుతో తాము లబ్ధి పొందలేదని, కాంగ్రెసు, తెరాసలే లబ్ధి పొందాయని ఆయన అన్నారు. తెలుగుదేశం పార్టీని కోదండరామ్ రెడ్డి విమర్శిస్తే సహించబోమని ఆయన అన్నారు. రెడ్డి జానా రెడ్డి, కేశవరావు ఇళ్లకు ఎందుకు వెళ్లారో, కోమటిరెడ్డి వెంకటరెడ్డి దీక్షకు ఎందుకు మద్దతు తెలిపారో చెప్పాలని ఆయన కోదండరామ్ను డిమాండ్ చేశారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి కాంట్రాక్టుల కోసం, పదవి కోసం దీక్ష చేస్తున్నాడని, మోసం చేస్తున్నాడని తాము చెప్పినా కోదండరామ్ వినలేదని ఆయన అన్నారు.
డబ్బులున్నాయనే కోమటిరెడ్డి వెంకటరెడ్డికి కోదండరామ్ రెడ్డి మద్దతు తెలిపాడని ఆయన ఆరోపించారు. డబ్బులు లేకపోవడం వల్లనే కొండా లక్ష్మణ్ బాపూజీ దీక్షకు కోదండరామ్ రెడ్డి మద్దతు ఇవ్వలేదని ఆయన అన్నారు. కాంగ్రెసుకు, తెరాసకు కోదండరామ్ రెడ్డి ఎందుకు కొమ్ము కాశాడో చెప్పాలని ఆయన అన్నారు. తమ పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఏనాడు కూడా తెలంగాణను వ్యతిరేకించలేదని ఆయన అన్నారు. తాము పార్టీని, జెండాను, ఎజెండాను పక్కకు పెట్టి వస్తామని, తెరాస నాయకులు కూడా అలా ముందుకు రావాలని ఆయన అన్నారు. ఈ విషయంపై రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయాలని ఆయన కోదండరామ్ను డిమాండ్ చేశారు.












Click it and Unblock the Notifications