మారిషస్ గుట్టు విప్పుతున్న విజయ సాయి రెడ్డి

వైయస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయిన కొద్ది రోజులకే లగ్జెంబర్గ్ కంపెనీ నుంచి మారిషస్ కంపెనీలకు నిధులను బదలాయించి, అక్కడ్నుంచి సండూర్లోకి పెట్టుబడుల రూపంలో మళ్లించారని అనుమానిస్తూ సిబిఐ అధికారులు పరిశోధన ప్రారంభించారు. ఈ నెల 11, 12 తేదీల్లో దానిపై విజయ సాయి రెడ్డి సిబిఐకి కొంత సమాచారం ఇచ్చారు. ఈ విషయాన్ని సిబిఐ కోర్టుకు తెలియజేసింది. సిబిఐ సేకరించిన వివరాల ప్రకారం - 2005-06సో మారిషస్కు చెందిన 2ఐ క్యాపిటల్, ఫ్లూరి ఎమర్జింగ్ సంస్థలు సండూర్ పవర్లో 1,75,49,307 షేర్లు కొనుగోలు చేశాయి. ఆ రెండు సంస్థలు షేర్ల కొనుగోలు ద్వారా మొత్తం రూ.124.60 కోట్లు పెట్టుబడిగా సమకూర్చాయి.
విదేశీ పెట్టుబడుల ద్వారా సండూర్కు వచ్చిన నిధులను వైయస్ జగన్ ఆరంభ పెట్టుబడిగా వివిధ కంపెనీల్లోకి మార్చుకున్నారు. వాస్తవానికి సండూర్లో తనకు ఉన్న 21,42,860 షేర్లను 2006-07లో నిమ్మగడ్డ ప్రసాద్కు విక్రయించారు. ఆ విధంగా రూ. 30 కోట్ల నిధులు రాబట్టారు. ఈ సమాచారం ఆధారంగానే సిబిఐ గోల్మాల్ వ్యవహారంగా భావించి పరిశోధన సాగించింది. మారిషస్ నుంచి వచ్చిన నిధులను వివిధ బోగస్ కంపెనీలు పుట్టించి, వాటికి బదలాయించారనేది ఆరోపణ. సాక్షి పత్రికను ప్రారంభించేందుకు ఆరంభ పెట్టుబడిని సమకూర్చిన కార్మెల్ ఏషియా సంస్థలో సండూర్ డబ్బును పెట్టింది. అప్పటికే సండూర్కు విదేశీ నిధులు వచ్చాయి. దీన్నిబట్టి సాక్షిలోకి మారిషస్ నిధులు వచ్చాయని భావిస్తున్నారు. మారిషస్ డబ్బులను బదలాయించడంలో వైయస్ జగన్ నిబంధనలను ఉల్లంఘించారనేది ఆరోపణ.












Click it and Unblock the Notifications