మిగిలింది చిరంజీవేనా?: అందరి దృష్టి అన్నయ్య పైనే
చిరంజీవిని కేంద్రంలోకి తీసుకోవాలని అధిష్ఠానం భావిస్తుండగా, రాష్ట్రానికి చెందిన కొందరు కాంగ్రెసు నేతలు మాత్రం రాష్ట్రంలోనే ఉండాలని సూచిస్తున్నారు. ఇలాంటి సమయంలో ఆయనకు ఎక్కడ పదవి ఇస్తారనే అంశంపై ఇటీవల కొంత చర్చ జరిగింది. అంతిమంగా మాత్రం కేంద్రానికే పంపించే అవకాశాలు కనిపిస్తున్నాయి. చిరంజీవికి ఎప్పుడు పదవి ఇస్తారు? ఏం ఇస్తారు? అనే అంశంపై తాజాగా చర్చ జరుగుతోంది. సిఆర్, గంటాల శాఖలపై పైస్థాయిలో చర్చ జరుగుతున్నప్పటికీ, కిందిస్థాయిలో మాత్రం చిరంజీవి పదవి పైనా చర్చ జరుగుతోంది. మరో రెండు నెలల్లో కొందరి రాజ్యసభ స్థానాలు ఖాళీ కానున్నాయి. ఈ నేపథ్యంలో వారి స్థానంలో చిరంజీవిని తీసుకొని, ఆయనను కేంద్రంలోకి తీసుకుంటారనే వాదనలు గతంలోనే వినిపించాయి. అయితే పిఆర్పీ వర్గంలో చిరంజీవి ఒక్కరే పదవికి మిగల్లేదని చెప్పవచ్చు.
గురువారం చిరంజీవి చేసిన వ్యాఖ్యల ద్వారా కూడా అది స్పష్టమౌతోంది. అధిష్టానం మూడు మంత్రి పదవులు ఇస్తే తెలంగాణకు కూడా న్యాయం జరిగేదని, తెలంగాణ నేతలకు కూడా న్యాయం చేసేందుకు తన వంతు ప్రయత్నాలు చేస్తానని ఆయన మీడియాతో మాట్లాడుతూ చెప్పారు. చిరు వర్గంలో రాయలసీమ నుండి సిఆర్, ఆంధ్రా ప్రాంతం నుండి గంటా పదవులు పొందారు. తెలంగాణ నుండి ఎమ్మెల్యేలు ఇద్దరే ఉన్నప్పటికీ, సమైక్యాంధ్ర నినాదం చేపట్టిన చిరంజీవి ఆ ప్రాంతానికి కూడా న్యాయం చేశాడన్న అభిప్రాయం కలగాలంటే ఆ ఎమ్మెల్యేలకు కూడా పదవులు ఇప్పించాల్సిన ఆవశ్యకత ఉందని కొందరు అభిప్రాయపడుతున్నారు. దాంతోపాటే సీమాంధ్ర అసంతృప్త నేతలకు న్యాయం చేయాల్సి ఉంది.