సిబిఐని టార్గెట్ చేసిన వైయస్ జగన్ పార్టీ నేతలు

ప్రతి రోజూ ఒక్కరో ఇద్దరో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులు సిబిఐని తిట్టిపోయడానికి మీడియా సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు. వాసిరెడ్డి పద్మ, జూపూడి ప్రభాకర్ రావు, అంబటి రాంబాబు అదే పనిగా పెట్టుకున్నారు. సిబిఐకి, రామోజీ రావుకు సంబంధాన్ని అంటగడుతూ వ్యాఖ్యలు చేస్తున్నారు. రామోజీ రావు ఈనాడు దినపత్రిక వార్తాకథనాలకు అనుగుణంగానే సిబిఐ వ్యవహరిస్తోందని వ్యాఖ్యలు చేసే దాకా వారు వెళ్తున్నారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడి పాత్రపై కూడా వారు విమర్శలు చేస్తున్నారు. తాజాగా, మంగళవారం వాసిరెడ్డి పద్మ మరో అడుగు ముందుకేశారు. మీడియాతో సిబిఐ జెడి చేతులు కలిపారని ఆమె విమర్శించారు.
సిబిఐ మాన్యువల్ కాపీలను మీడియాకు అందజేశారని, సిబిఐ నిబంధనలను పాటించలేదని ఆమె అన్నారు. సిబిఐ దర్యాప్తు ఫాక్షన్ సంస్కృతిని తలపిస్తోందని కూడా ఆమె అన్నారు. మీడియాకు సిబిఐ తప్పుడు కథనాలను అందించిందని ఆమె అన్నారు. రాష్ట్లంలో ఐఎఎస్ల పరిస్థితే అలా ఉంటే సామాన్యుల పరిస్థితి ఏమిటని ఆమె అడిగారు. మొత్తంగా వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులు రోజుకో రకంగా సిబిఐని దుమ్మెత్తిపోస్తున్నారు. సాక్షి దినపత్రిలో ఈ ప్రకటనలకు ప్రాధాన్యం ఇస్తూ ప్రచురిస్తున్నారు. అదే సమయంలో సిబిఐ తీరును విమర్శిస్తూ ఈనాడు, చంద్రబాబుకు, సిబిఐకి లింక్ పెడుతూ వార్తాకథనాలను ప్రచురిస్తున్నారు. అలాంటి వ్యాఖ్యలను పదే పదే చేయడం ద్వారా ప్రజల నుంచి సానుభూతి పొందాలని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ భావిస్తున్నట్లు అర్థం చేసుకోవచ్చు.












Click it and Unblock the Notifications