నాలుకలు కోస్తాం: బాబుకు, టిడిపి నేతలకు కెసిఆర్ హెచ్చరిక
చంద్రబాబు తన మీద ఉమ్మేస్తే తిరిగి చంద్రబాబు మీదే పడిందని, తెలంగాణపై కుడో ఎడమో చెప్పాలని ఆయన అన్నారు. చంద్రబాబువి కంపు మాటలని ఆయన అన్నారు. చంద్రబాబుని అతి నికృష్టమైన రాజకీయ నాయకుడిగా ఆయన అభివర్ణించారు. చంద్రబాబు ప్రభుత్వ హయాంలో రైతులు, చేనేత కార్మికులు ఆత్మహత్యలు చేసుకున్నారని ఆయన విమర్శించారు. విద్యుత్ చార్జీల పెంపుపై ఆందోళనకు దిగిన ముగ్గురిని కాల్చి చంపిన నరరూప రాక్షసుడు చంద్రబాబు అని ఆయన అన్నారు. అంగన్వాడీ టీచర్లను గుర్రాలతో తొక్కించిన చరిత్ర చంద్రబాబుదని ఆయన అన్నారు. తెలంగాణ భూములను, సంస్థలను తక్కువ ధరలకు అమ్మింది చంద్రబాబేనని ఆయన అన్నారు. తాము పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్నే వ్యతిరేకిస్తున్నామని, చంద్రబాబు పోలవరాన్ని నిర్మిస్తామని ఆంధ్రలో ఉపన్యాసాలిస్తున్నారని, పోలవరంపై తెలుగుదేశం తెలంగాణ నాయకులు వాళ్ల వైఖరిని చెప్పాలని ఆయన అన్నారు. పోలవరం ప్రాజెక్టును అడ్డుకుంటున్నామని వైయస్ రాజశేఖర రెడ్డి తమ పార్టీ శాసనసభ్యులను చూపిస్తూ అన్నారని ఆయన అన్నారు. పోలవరం ప్రాజెక్టుకు వ్యతిరేకంగా తాము సుప్రీంకోర్టుకు వెళ్లామని, ఆ కేసు ఇంకా నడుస్తోందని ఆయన అన్నారు. అటువంటి తమకు మోకాలికి బోడి గుండుకు లంకె పెట్టినట్లు పోలవరం టెండర్ల వ్యవహారాన్ని ముడి పెడుతున్నారని ఆయన అన్నారు.
చంద్రబాబు ఆస్తులపై సిబిఐ విచారణకు హైకోర్టు ఆదేశాలిస్తే, వద్దని చెప్పి చంద్రబాబు వద్దంటూ తిరుగుతున్నారని ఆయన అన్నారు. కుంభకోణాలు చేశారు కాబట్టే చంద్రబాబు న్యాయపరీక్షలకు నిలబడడం లేదని ఆయన అన్నారు. ఒక్కసారైనా చంద్రబాబు న్యాయపరీక్షకు నిలబడ్డారా అని ఆయన అడిగారు. చంద్రబాబు హయాంలో నకిలీ స్టాంపులు, ఏలేరు, అర్బన్ బ్యాంకులు, మద్యం కుంభకోణాల వంటి పలు కుంభకోణాలు జరిగాయని ఆయన అన్నారు. ఆల్విన్, నిజాం షుగర్స్ వంటి 20 తెలంగాణ కంపెనీలను చంద్రబాబు తక్కువ ధరకే కట్టబెట్టారని ఆయన ఆరోపించారు. ఎమ్మార్ ప్రాపర్టీస్ను తెచ్చింది చంద్రబాబు కాదా అని ఆయన అడిగారు. ఎమ్మార్ ప్రాపర్టీస్లో బాలకృష్ణకు, చంద్రబాబు కోడలికి, చంద్రబాబు కుటుంబ సభ్యులకు విల్లాలు ఎలా వచ్చాయని ఆయన అడిగారు. రెండెకరాలు మాత్రమే చంద్రబాబు తల్లి ఆయన కుమారుడు లోకేష్కు 30 లక్షల రూపాయల పెట్టి ఐదెకరాల భూమిని హైదరాబాదులో ఎలా కొనుగోలు చేసి ఇస్తుందని ఆయన అడిగారు. చంద్రబాబుది బినామీ బతుకు, బినామీ కంపెనీల బతుకు అని ఆయన అన్నారు. తెలంగాణ ఉప ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి ఒక్క సీటులో కూడా డిపాజిట్ దక్కదని ఆయన అన్నారు. దమ్ముంటే తెలంగాణ ఉప ఎన్నికల్లో తేల్చుకుందా, రా అని ఆయన చంద్రబాబును సవాల్ చేశారు. వచ్చిన తెలంగాణను కుట్ర చేసి ఆపింది చంద్రబాబేనని ఆయన అన్నారు.