జగన్కు బొత్స సవాల్, మాతోనే వైయస్ నేత అయ్యారు
ఎవరి వ్యక్తిగత ప్రయోజనాల కోసం ఉప ఎన్నికలు జరుగుతున్నాయో గుర్తించాలన్నారు. వ్యక్తిగత స్వార్థ ప్రయోజనాల కోసమే ఉప ఎన్నికలు వచ్చాయని అందరికీ తెలుసునన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి ప్రవేశ పెట్టిన పథకాలను కాంగ్రెసు ప్రభుత్వం అమలు చేయడం లేదని జగన్ కల్లిబొల్లి మాటలు చెబుతున్నారని విమర్శించారు. ప్రజలను నమ్మించే ప్రయత్నం చేస్తున్నారన్నారు.
2004 నుంచి అమలవుతున్న ఏ ఒక్క పథకాన్ని కూడా కాంగ్రెసు విస్మరించలేదన్నారు. అభివృద్ధి, సంక్షేమం, జగన్ అవినీతే మా ప్రచారం అజెండా అన్నారు. స్వప్రయోజనాల కోసం ఉప ఎన్నికలు తీసుకు వచ్చిన వారిని ఎండగడతామన్నారు. అభివృద్ధి, సంక్షేమం గురించి మాట్లాడే నైతిక హక్కు తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడుకు లేదన్నారు.
చంద్రబాబు తెలియకుండా మాట్లాడితే ఎలా అన్నారు. తెలుసుకొని మాట్లాడాలని సూచించారు. దోచుకున్న చంద్రబాబు నీతులు చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. ముగ్గురు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు మద్యం వ్యాపారం చేస్తున్నారని ఆరోపించారు. విజయనగరం జిల్లాకు చెందిన టిడిపి ఎమ్మెల్యే భర్త మఠా నాయకుడు అని విమర్శించారు.
కెబినెట్ నిర్ణయాలకు మేమూ బాధ్యులమేనని, అయితే తెరవెనుక జరిగే లావాదేవీలకు తాము బాధ్యులం కామని చెప్పారు. తనలాంటి ఎందరో కలిస్తే వైయస్ నేత అయ్యారన్నారు. అందరి సహకారం వల్లే ఆయన నేత అయ్యాడని గుర్తుంచుకోవాలన్నారు. వడ్డించేవాడు మనవాడైతే ఎక్కడైనా కూర్చోవచ్చునని పరోక్షంగా జగన్ను ఉద్దేశించి అన్నారు. కాగా బొత్స సత్యనారాయణ ఆదివారం నుండి ఉప ఎన్నికల ప్రచారం ప్రారంభించిన విషయం తెలిసిందే. ఉప ఎన్నికలలో కాంగ్రెసు పార్టీ ఘన విజయం సాధిస్తుందని ఆయన చెప్పారు.