వైయస్ చిచ్చు: కిరణ్ కుమార్ రెడ్డి మాటలు బేఖాతరు

వైయస్ రాజశేఖర రెడ్డిని ఏ విధంగా చూడాలనే విషయంపై కాంగ్రెసు పార్టీలో రెండు భిన్నమైన వాదనలు వినిపిస్తున్నాయి. వైయస్ రాజశేఖర రెడ్డి దళిత వ్యతిరేకి అని కాంగ్రెసు పార్లమెంటు సభ్యుడు హర్షకుమార్ తాజాగా బుధవారం విమర్శించారు. దళితులకు వైయస్ రాజశేఖర రెడ్డి అన్యాయం చేశారని ఆయన అన్నారు. వైయస్ చేసిన అన్యాయంపై దళితులను చైతన్యవంతులను చేస్తానని కూడా ఆయన అన్నారు.
అయితే, హర్షకుమార్ వాదనతో మాజీ మంత్రి పి. శంకరరావు విభేదిస్తున్నారు. వైయస్ రాజశేఖర రెడ్డి దళిత వ్యతిరేకి అంటే తాను అంగీకరించబోనని ఆయన బుధవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. వైయస్ రాజశేఖర రెడ్డిని విమర్శిస్తే కాంగ్రెసు పార్టీకి నష్టం జరుగుతుందని ఆయన అన్నారు. కాంగ్రెసు పార్టీలో ముగ్గురు దళిత శాసనసభ్యులకు విప్ పదవులు ఇచ్చింది వైయస్సార్ కాదా అని ఆయన అడిగారు. సిఎల్పీ కార్యాలయంలో వైయస్సార్ ఫొటో తొలగించడం వల్ల పార్టీకి చెడ్డ పేరు వస్తుందని ఆయన అన్నారు.
కాంగ్రెసు సీనియర్ నాయకుడు పాల్వాయి గోవర్ధన్ రెడ్డితో పాటు మెగాస్టార్ చిరంజీవి కూడా వైయస్ రాజశేఖర రెడ్డిపై విమర్శలు చేశారు. వైయస్ రాజశేఖర రెడ్డి, వైయస్ జగన్ ఒక్క చెట్టు కొమ్మలేనని చిరంజీవి అన్నారు. వైయస్ రాజశేఖర రెడ్డికి తెలియకుండా అవినీతి జరిగే అవకాశం లేదని పాల్వాయి గోవర్ధన్ రెడ్డి అన్నారు. అవినీతికి వైయస్ రాజశేఖర రెడ్డిని కూడా బాధ్యుడిని చేయాలని ఆయన అన్నారు. వైయస్ రాజశేఖర రెడ్డిని విమర్శించకుండా వైయస్ జగన్ను విమర్శించలేమని ఆయన అన్నారు.
వైయస్ రాజశేఖర రెడ్డి విషయంలో రెండు విషయాల్లో కాంగ్రెసు పార్టీలో వివాదం చోటు చేసుకుంది. వైయస్ రాజశేఖర రెడ్డిని దళిత వ్యతిరేకిగా చూడాలా, లేదా అనే వివాదం ఒక్కటి కాగా, వైయస్ జగన్పై వచ్చిన అవినీతి ఆరోపణలకు సంబంధించి వైయస్ రాజశేఖర రెడ్డిని బాధ్యుడిని చేయాలా, వద్దా అనేది మరో వివాదం. ఈ రెండు వివాదాల విషయంలో కాంగ్రెసు పార్టీలోని నాయకులు రెండుగా చీలిపోయారు. కాంగ్రెసులోని దళిత నాయకులు వైయస్ రాజశేఖర రెడ్డి దళిత వైఖరిపై పరస్పర విరుద్ధమైన ప్రకటనలు చేస్తుండగా, ఇతర నాయకులు వైయస్సార్ అవినీతి విషయంలో రెండుగా విడిపోయారు.












Click it and Unblock the Notifications