సబితా ఇంద్రా రెడ్డి, సిబిఐని టార్గెట్ చేసిన శ్రీలక్ష్మి
సీనియర్ ఐఏఎస్ శ్రీలక్ష్మి బెయిల్ పిటిషన్పై సిబిఐ ప్రత్యేక న్యాయస్థానంలో శనివారం సుదీర్ఘ వాదనలు జరిగాయి. ఆమె తరఫున సురేంద్ర రావు వాదనలు వినిపించారు. ఓఎంసీకి లీజులు మంజూరు చేసేందుకు ఒకే రోజు రెండు జీవోలపై సంతకాలు చేసినట్లు ఆరోపించారు. నిజానికి... ఎపిఎండిసి పరిధిలోని 25 హెకార్లు ఓఎంసికి దక్కకుండా తానే అడ్డుకున్నానన్నారు. వాటిలో మైనింగ్ జరగనందున వాటినీ తమకే కేటాయించాలని ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డికి ఓఎంసి లేఖ రాసిందని, ఆ లేఖను సిఎంవో ద్వారా నాకు పంపారని తెలిపింది.
ఈ ప్రతిపాదనకు తాను ఒప్పుకోలేదన్నారు. ఫైల్ను మంత్రికి పంపలేదన్నారు. ఒకవేళ ఆ ఫైల్ను పంపి ఉంటే వైయస్కు మంత్రి సన్నిహితమైనందున దాన్ని ఆమోదించేవారన్నారు. ఓఎంసికి లీజుల కేటాయింపులో తన పాత్ర పరిమితమని శ్రీలక్ష్మి తెలిపారు. లీజులు కేటాయింపులపై కేబినెట్ సమష్టిగా నిర్ణయం తీసుకుంటుందని కానీ, తనను మాత్రమే తప్పు పట్టడమేమిటని నిలదీశారు. గనుల వ్యాపారి శశి కుమార్ ఎప్పుడూ సిబిఐ కార్యాలయంలోనే కనిపిస్తారని, ఆయన మాటలకు విలువ ఎలా ఇస్తారు? సిబిఐ కావాలనే ఈ కేసును మసిపూసి మారేడు కాయ చేస్తోందని విమర్శించారు.
మొదటి చార్జ్షీట్లో సాక్షులుగా చూపిన వారినే సప్లిమెంటరీ చార్జ్షీట్లోనూ చూపిందన్నారు. వారిచ్చిన వాంగ్మూలాలకు కొంత అదనపు సమాచారం జోడించిందన్నారు. మైనింగ్ లీజుల కేటాయింపు అంతా కేంద్ర నిర్ణయంపైనే జరుగుతుందని, ఇందులో రాష్ట్రం పాత్ర తక్కువని శ్రీలక్ష్మి లాయర్ పేర్కొన్నారు. లీజుల కోసం దరఖాస్తు చేసిన ఇతర కంపెనీల వివరణలు కోరకుండానే, తగిన సమయం ఇవ్వకుండానే తిరస్కరించారనే ఆరోపణలు సరికాదన్నారు.
సాక్ష్యాలను తారుమారుచేస్తారనే అనుమానం ఉంటే... శ్రీలక్ష్మి హైదరాబాద్ వెలుపల ఉండేందుకు కూడా సిద్ధమని, ఆమెకు బెయిల్ ఇవ్వాలని కోరారు. కాగా శ్రీలక్ష్మి తరఫు వాదనలను సిబిఐ లాయర్ రవీంద్రనాథ్ బలంగా తిప్పికొట్టారు. జీవోల కోసం జనం సెక్రటేరియట్ చుట్టూ ఏళ్ల తరబడి తిరుగుతుంటారన్నారు. కానీ... ఓఎంసికి లబ్ధి చేకూర్చేందుకు శ్రీలక్ష్మి రెండు జీవోలను ఒకేరోజు జారీ చేశారన్నారు. దీని ద్వారా ఆమెకు ఏమైనా ప్రయోజనం చేకూరిందా.. అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నామన్నారు.
అలాగే ఆమె మరిది ఆస్తుల పైనా, గాలి పీఏ అలీ ఖాన్కు తెలిసిన విషయాలు రాబట్టడంపై సిబిఐ దృష్టి పెట్టిందని అన్నారు. ఉన్నత స్థానాల్లో ఉన్న శ్రీలక్ష్మి దంపతులు కేసును ప్రభావితం చేయొచ్చని... ఈ దశలో ఆమెకు బెయిల్ ఇవ్వడం సరికాదని కోర్టుకు నివేదించారు. ఈ కేసులో వాదోపవాదాలు పూర్తి అయ్యాయి. బెయిల్పై ఈనెల 11న కోర్టు నిర్ణయం వెలువడనుంది.