రేపు ఉప ఎన్నికల నోటిఫికేషన్ జారీ: భన్వర్ లాల్

ఈ నెల 25వ తేదీ సాయంత్రం 3 గంటల వరకు నామినేషన్లను స్వీకరిస్తారు. భన్వర్లాల్తో పాటు అదనపు పోలీసు డైరెక్టర్ జనరల్ 12 జిల్లాల ఎన్నికల అధికారులతో, పోలీసు సూపరిండెంట్స్తో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళిని, శాంతిభద్రతలను అమలు చేయాలని ఆదేశించారు.
ఉప ఎన్నికలకు సంబంధించి గురువారం సాయంత్రం మూడున్నర గంటలకు భన్వర్లాల్ గుర్తింపు పొందిన పార్టీల ప్రతినిధులతో సమావేశం ఏర్పాటు చేశారు. ప్రదీప్ కుమార్ (బిజెపి), అట్లూరి రామకృష్ణ (సిపిఎం), కమలాకర్ రావు, సి. ఉమా మల్లేశ్వర రావు (కాంగ్రెసు), శ్రవణ్ దాసోజు (తెరాస), వర్ల రామయ్య, కె జనార్దన్ రావు (తెలుగుదేశం) ఈ సమావేశానికి హాజరయ్యారు.
ఉప ఎన్నికల నేపథ్యంలో తనిఖీలు ముమ్మరం చేశామని భన్వర్ లాల్ చెప్పారు. ఇప్పటి దాకా రూ 14.50 కోట్ల నగదు, 1.07 లక్షల లీటర్ల మద్యం, 2,457 ఆయుధాలు స్వాధీనం చేసుకున్నట్లు ఆయన తెలిపారు. 19,036 మందిని బైండోవర్ చేసినట్లు ఆయన తెలిపారు. రేపు పది గంటలకు నోటిఫికేషన్ జారీ అవుతుందని ఆయన చెప్పారు.
మీడియా యాజమాన్యాలతో త్వరలో ఒక భేటీ నిర్వహిస్తామని భన్వర్లాల్ వెల్లడించారు. ఉప ఎన్నికల నేపథ్యంలో పలు ఛానెళ్ళు నిర్వహిస్తున్న ఎగ్జిట్ పోల్స్ విజయావకాశాలపై ప్రభావం చూపుతాయని తెలుగుదేశం పార్టీ గురువారం ఈసీకి ఫిర్యాదు చేసింది. దీనితో త్వరలోనే మీడియా యాజమాన్యాలతో సమావేశం నిర్వహిస్తామని అఖిలపక్ష నేతల సమావేశంలో భన్వర్లాల్ తెలిపారు. అలాగే నరసన్నపేటలో మంత్రి ధర్మాన ప్రభుత్వ భవనాలను ఎన్నికల ప్రచారం నిమిత్తం ఉపయోగించుకుంటున్నారని, మరికొన్ని చోట్ల అభ్యర్థులు నిబంధనలు ఉల్లంఘించారనీ టీడీపీ ఫిర్యాదు చేసింది.












Click it and Unblock the Notifications