విదేశీ అకౌంట్లు: సాక్షిపై బాబు నిప్పులు, జగన్కు సవాల్
తనకు నల్లడబ్బు ఉందని, అకౌంట్లు ఉన్నాయని పేర్కొన్న పలు ఊర్లు, ఆ ఊర్లలో ఆయా వ్యక్తులు లేనే లేరన్నారు. తనపై ఆరోపణలు చేసిన కోలా కృష్ణ మోహన్ కానీ, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ కానీ తనకు వారు చెప్పినట్లుగా అకౌంట్లు ఉన్నట్లు నిరూపించాలని సవాల్ చేశారు. కోలా కృష్ణ మోహన్ తనకు యూరో లాటరీ వచ్చిందని చెప్పి తమ పార్టీకి రూ.10 లక్షలు విరాళం ఇచ్చారని చెప్పారు.
అతని మోసం తెలిసిన వెంటనే తాము ఆ డబ్బును కోర్టులో డిపాజిట్ చేశామని చెప్పారు. కోలా ఆరోపణలు పూర్తిగా అవాస్తవమన్నారు. కోలాతో అంతకుముంచి తనకు ఎలాంటి సంబంధం లేదన్నారు. అవినీతి సొమ్ముతో పత్రికను పెట్టి తనపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారన్నారు. నేరాల ఊబిలో చిక్కుకుపోయి వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేతలు తమపై బురద జల్లే ప్రయత్నాలు చేస్తున్నారన్నారు.
తనపై 85సార్లు విచారణ జరిపినా ఏమీ నిరూపించలేక పోయారన్నారు. వాస్తవాలు చెప్పే ధైర్యం లేక తనపై బురద జల్లుతున్నారన్నారు. సాక్షిలో పేర్కొన్న అకౌంట్లు తనవనే గట్టి విశ్వాసం ఉంటే వారు ఫిర్యాదు చేసుకోవచ్చునని సూచించారు. సిగ్గు లేకుండా ఇష్టం వచ్చినట్లు ఆరోపణలు చేస్తున్నారన్నారు. మాకు నైతిక బలముందని, తామెక్కడా భయపడే ప్రసక్తి లేదని చెప్పారు.
తనపై ఆరోపణలు చేసేవారు సిగ్గుతో తలదించుకునే రోజు వస్తుందన్నారు. తన నిజాయితీని ఎన్నిసార్లు నిరూపించుకోవాలని ప్రశ్నించారు. సాక్షి పత్రిక పనికి రాని దౌర్భాగ్య పత్రిక అన్నారు. ప్రజలలో తనపై అనుమానాలు రేకెత్తించడమే ఆ పత్రిక లక్ష్యమన్నారు. కోలాను ఏమైనా చేసి ఆ నేరాన్ని నా పైకి నెట్టినా ఆశ్చర్యం లేదన్నారు.
తాను గానీ, తమ నాయకుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు గానీ నీతివంతమైన పాలన ఇచ్చామన్నారు. కోలా కృష్ణ మోహన్ ఇప్పటికే దోషిగా తేలారన్నారు. కాగా చంద్రబాబు సన్నిహితులకు మారిషస్లో పలు బ్యాంకు అకౌంట్లు ఉన్నాయని, ఖాతా నంబర్లతో సహా బాబు నాటి సన్నిహితుడు కోలా కృష్ణ మోహన్ బయట పెట్టారని జగన్కు చెందిన సాక్షి దినపత్రికలో బుధవారం కథనం వచ్చింది.