వెనక్కి తగ్గారా?: చంద్రబాబు ఇంటికి వెళ్లిన తలసాని
తలసాని శ్రీనివాస యాదవ్ ఇటీవల రాజ్యసభ ఎన్నికలప్పటి నుండి పార్టీ పైన అసంతృప్తితో ఉన్నారు. 2009లో సికింద్రాబాద్ నియోజకవర్గం నుండి పోటీ చేసిన తలసాని కాంగ్రెసు ఎమ్మెల్యే జయసుధ చేతిలో ఓడిపోయారు. రాజ్యసభ సీటు కోసం తీవ్ర ప్రయత్నాలు చేశారు. తనకు ఇవ్వకపోవడమే కాకుండా పార్టీ సీనియర్ నేత దేవేందర్ గౌడ్కు టిక్కెట్ ఇవ్వడం ఆయనకు తీవ్ర ఆగ్రహం కలిగించింది.
తలసాని అప్పుడే తన అసంతృప్తిని వెళ్లగక్కారు. రాజ్యసభ అభ్యర్థి కోసం బాబు చర్చిస్తున్నప్పుడు మధ్యలోనే బయటకు వచ్చేశారు. పార్టీ భవిష్యత్తు పైన ఘాటైన వ్యాఖ్యలు చేశారు. ఆ తర్వాత పలుమార్లు ప్రెస్ మీట్లు పెట్టిన ఆయన ఎప్పుడూ తెలుగుదేశం పార్టీ కార్యాలయం ఎన్టీఆర్ ట్రస్టు భవన్లో పెట్టలేదు. ప్రెస్ క్లబ్లోనే విలేకరుల సమావేశం నిర్వహిస్తూ వస్తున్నారు. పార్టీలో ఉండే అంశంపై విలేకరులు ప్రశ్నించినప్పుడు కూడా పొడి పొడిగా సమాధానం చెబుతున్నారు.
పార్టీలోనే ఉన్నానని, పార్టీని వీడటం లేదని లేదా మరో పార్టీలో చేరతానని ఇలాంటి వాటిపై ఆయన స్పందించడం లేదు. విలేకరులు అడిగితే అలాంటి ప్రశ్న ఎందుకు ఉత్పన్నమవుతోందని ఎదురు ప్రశ్న వేస్తున్నారు. ఆయన కడప పార్లమెంటు సభ్యుడు, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి వైపు మొగ్గు చూపుతున్నారనే ప్రచారం జరిగింది. ఇప్పుడు బాబును కలిసి మహంకాళీ బోనాల జాతరకు ఆహ్వానించడం చూస్తుంటే టిడిపి పైన ఆయన అసంతృప్తి తగ్గినట్లుగా కనిపిస్తోందని అంటున్నారు.