మారిన వ్యూహం: లోకేష్ వెనక్కి, బాలయ్య ముందుకి
కొడాలి నాని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ను కలవడం వెనక తన పాత్ర ఏమీ లేదని జూనియర్ ఎన్టీఆర్ చెబుతున్నప్పటికీ ఆ మాటలను చంద్రబాబు వర్గం విశ్వసించడం లేదు. నందమూరి హరికృష్ణ, జూనియర్ ఎన్టీఆర్ పార్టీకి దూరంగా ఉండడానికి, నాని ఉదంతానికి సంబంధం అంటగట్టే చూస్తున్నారు. పైగా, నారా లోకేష్ను ప్రత్యక్ష రాజకీయాల్లోకి తెచ్చి, తెలుగుయువత అధ్యక్ష పదవిని అప్పగిస్తారని వార్తలు వస్తున్న నేపథ్యంలో ఈ పరిణామం చోటు చేసుకోవడాన్ని కూడా జూనియర్ ఎన్టీఆర్కు లింక్ పెట్టే చూస్తున్నారు. అందువల్ల ఆ పరిణామాలను అధిగమించడానికే కాకుండా పార్టీలోని ఎదిరి వర్గాన్ని దెబ్బ కొట్టడానికి తగిన వ్యూహంలో భాగంగానే బాలకృష్ణను ముందుకు తెస్తున్నట్లు చెబుతున్నారు.
తాను ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తానని, ఎన్నికల్లో పోటీ చేస్తానని బాలకృష్ణ ఇప్పటికే ప్రకటించారు. అందువల్ల సాధ్యమైనంత త్వరగా బాలకృష్ణను రంగంలోకి దించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నట్లు తెలుస్తోంది. అమెరికా నుంచి తిరిగి వచ్చిన బాలకృష్ణ బుధవారం రాత్రి చంద్రబాబుతో సమావేశమయ్యారు. ఎన్టీఆర్ అభిమానులను బయటకు పంపిస్తున్నారని, నారా లోకేష్ కోసమే అలా చేస్తున్నారని విమర్శలు వస్తున్న స్థితిలో బాలకృష్ణ క్రియాశీలక పాత్ర పోషిస్తే వాతావరణం తమకు అనుకూలంగా మారుతుందనే ఉద్దేశంతో చంద్రబాబు ఉన్నట్లు చెబుతున్నారు.
పార్టీలో నందమూరి, నారా వారసత్వ పోరు బహిరంగ పోరుగా ముందుకు వచ్చిన ప్రతిసారీ బాలకృష్ణ రాజకీయ ప్రకటనలు చేస్తున్నారు. చంద్రబాబుకు అండగా ఆయన ఆ ప్రకటనలు చేస్తూ వస్తున్నారు. ఈ విషయంలో చంద్రబాబు బాలకృష్ణను వాడుకుంటున్నారనే అభిప్రాయం ఉంది. నందమూరి హరికృష్ణ, జూనియర్ ఎన్టీఆర్లకు బాలకృష్ణను ఎదురు పెట్టి రాజకీయం నడిపిస్తున్నారని అంటున్నారు. ఇదే రీతిలో ఇప్పుడు వ్యవహరించే అవకాశం ఉందని చెబుతున్నారు. అయితే, ఈసారి నేరుగానే పార్టీలో ఏదో విధమైన బాధ్యతను బాలకృష్ణ తీసుకునే అవకాశం ఉందని చెబుతున్నారు.