చిరంజీవి ఫ్యూచర్ ముఖ్యమంత్రి: మంత్రి గంటా జోస్యం
చిరంజీవి ముఖ్యమంత్రి అవుతారన్న రామచంద్రయ్య వ్యాఖ్యలపై ఆయనను విలేకరులు ప్రశ్నించగా.. చిరంజీవి ప్రజల మనిషి అని, ఆయన ప్రజల నుండి వచ్చిన వ్యక్తి అని, అలాంటి వ్యక్తి భవిష్యత్తులో ఖచ్చితంగా ముఖ్యమంత్రి అవుతారని, ఇందులో ఎలాంటి అనుమానాలకు తావు లేదని, చిరంజీవి సిఎం అవుతారని తాను గట్టిగా విశ్వసిస్తున్నానని గంటా శ్రీనివాస రావు చెప్పారు.
కాగా తమ పార్టీ నాయకుడు, రాజ్యసభ సభ్యుడు చిరంజీవి విషయంలో రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి సి. రామచంద్రయ్య శనివారం సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. చిరంజీవి త్వరలో ముఖ్యమంత్రి అవుతారని ఆయన అన్నారు. అయితే, నేరుగా చెప్పకుండా పరోక్షంగా ఆ విషయం చెప్పారు. పశ్చిమ గోదావరి జిల్లా ద్వారకా తిరుమలలో ఆయన శనివారం కాపు కళ్యాణ మండపాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన ఆ వ్యాఖ్యలు చేశారు.
చిరంజీవి ముఖ్యమంత్రి కావాలని ప్రజలు కోరుకుంటున్నారని, ప్రజల అభీష్టం త్వరలో నెరవేరుతుందని ఆయన అన్నారు. అంతకు మించి ఆయన ఎక్కువగా మాట్లాడలేదు. కాపు కళ్యాణ మండపం ప్రారంభ కార్యక్రమానికి గంటా శ్రీనివాస రావుతో పాటు ఐదుగురు మంత్రులు, పలువురు శాసనసభ్యులు హాజరయ్యారు. ఇంత మంది పాల్గొన్న కార్యక్రమంలో రామచంద్రయ్య ఆ వ్యాఖ్యలు చేయడం వెనక రాజకీయ ఉద్దేశం ఉందని అంటున్నారు.
ఉప రాష్ట్రపతి ఎన్నికల తర్వాత రాష్ట్రంలో నాయకత్వ మార్పు జరుగుతుందనే ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో చర్చకు తెర తీయాలనే ఉద్దేశంతో రామచంద్రయ్య ఆ వ్యాఖ్యలు చేసినట్లు భావిస్తున్నారు. కాంగ్రెసులో ప్రజారాజ్యం పార్టీ విలీనం కావడంలో ఆయన కీలక పాత్ర పోషించారు. చిరంజీవికి ఆయన అత్యంత సన్నిహితుడు కూడా.