సిఎం మసావేశానికి కోట్ల డుమ్మా: అనుచరుల గొడవ
కిరణ్ కుమార్ రెడ్డి, బొత్స సత్యనారాయణ మాట్లాడుతున్నప్పుడు కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి వర్గీయులు తమకు మాట్లాడే అవకాశం ఇవ్వాలని డిమాండ్ చేశారు. తమ సమస్యలను పరిష్కరించాలని కోరారు. నామినేటెడ్ పోస్టులు, పార్టీ పోస్టులు భర్తీ చేయాలని వారు కోరారు. కర్నూలు జిల్లాకు చెందిన కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి ఈ సమావేశానికి హాజరు కాలేదు. కోట్ల వర్గీయులను బొత్స సత్యనారాయణ సముదాయించారు.
అందరం కలిసికట్టుగా పనిచేయాలని బొత్స సత్యనారాయణ వారికి హితవు చెప్పారు. సమావేశంలో తమ నేత కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి బొమ్మ లేదని ఆయన వర్గీయులు తీవ్ర అభ్యంతరం చెప్పారు. కాంగ్రెసును ఓడించే పార్టీ ఇప్పటికీ పుట్టలేదని ముఖ్యమంత్రి తన ప్రసంగంలో అన్నారు. గ్రామస్థాయి నేతలను విస్మరిస్తే పార్టీకి భవిష్యత్తు ఉండదని ఆయన అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లపై బీసీ ప్రజా ప్రతినిధులతో మాట్లాడి నిర్ణయం తీసుకుంటామని ఆయన చెప్పారు. ప్రభుత్వపరంగా ఏం చేయాలో త్వరలోనే వెల్లడిస్తామని ఆయన అన్నారు.
కర్నూలు జిల్లాలో రెండో రోజు ఆయన ఇందిర బాటను కొనసాగించారు. బుధవారం ఉపాధ్యాయ దినోత్సవం కావడంతో ఆయన అంతకు ముందు మాట్లాడుతూ... విద్యార్థులను సరైన బాటలో నడిపించేది కేవలం ఉపాధ్యాయుడు మాత్రమే అన్నారు. విద్యార్థులకు మన కుటుంబ వ్యవస్థ గురించి టీచర్లు చెప్పాలని సూచించారు.చదువు అంటే మార్కులు కాదని ఎలాంటి సమస్యనైనా ఎదుర్కోగలిగేలా ఉండాలని, అలా విద్యార్థులను తీర్చిదిద్దాలన్నారు. మన కుటుంబ వ్యవస్థ గురించి చెప్పాలన్నారు.