తెరాస నేతల గుర్రు: వెనక్కి తగ్గిన కోదండరామ్
కెసిఆర్పై విమలక్క చేసిన వ్యాఖ్యలను కోదండరామ్ ఖండించకపోవడమే కాకుండా తమకు చెప్పకుండా కవాతు కొనసాగుతుందని కోదండరామ్ ఆదివారం ప్రకటించడం తెరాస నాయకులను ఇబ్బందిపెట్టినట్లు తెలుస్తోంది. దీంతో కోదండరామ్ తాను ఏకపక్షంగా వ్యవహరిస్తున్నాననే అభిప్రాయం కలగకుండా మార్చ్ను ముగించారు. కానీ విమలక్క వంటి నాయకులు చేసిన ప్రకటనలను ఖండించడానికి ముందుకు రాలేదు. పైగా, విమలక్క వ్యాఖ్యలపై తాను స్పందించబోనని సోమవారం అన్నారు. అయితే, మంగళవారం తన వైఖరి మార్చుకున్నారు.
తెలంగాణ మార్చ్లో తెరాసపై ప్రజాసంఘాలు చేసి వ్యాఖ్యలను ఖండిస్తున్నాని ప్రొఫెసర్ కోదండరాం కీలక వ్యాఖ్యలు చేశారు. మంగళవారం ఉదయం బాపూఘాట్ వద్ద మౌనదీక్ష లో ఆయన పాల్గొనడానికి ముందు ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సందర్బంగా ఆయన ఆ ప్రకటన చేశారు. తెరాసను దూరం చేసుకోవడం ఇష్టంలేకనే ఆయన ఆ ప్రకటన చేసినట్లు చెబుతున్నారు.
దానికితోడు, మరో అడుగు ముందుకేసి కూడా కోదండరామ్ మాట్లాడారు. తెలంగాణ కోసం లాబీయింగ్ కూడా అవసరమేనని అన్నారు. ఢిల్లీలో కెసిఆర్ చర్చలు జరపడాన్ని కొంత మంది వ్యతిరేకిస్తూ తీవ్రమైన వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో కోదండరామ్ కెసిఆర్ను సమర్థించే విధంగా ప్రకటన చేశారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఇంకా ఆలస్యమవుతుందంటూ కేంద్ర హోంమంత్రి షిండే చేసిన వ్యాఖ్యలు సరికావన్నారు. పోలీసులతో ఉద్యమాన్ని అణచివేయాలని ప్రభుత్వం కుట్ర చేస్తోందని ఆయన ఆరోపించారు. తెలంగాణ కోసం శాంతియుతంగా పోరాడుతామని కోదండరాం అన్నారు.