షర్మిల బాణం ఎవరి పైకి, జగన్ నేరాలపై వదలాలి: బొత్స
దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి పేరును ఛార్జీషీట్లో కాంగ్రెసు పార్టీ పెట్టలేదని, సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్(సిబిఐ) పెట్టిందన్నారు. జగన్ కేసులకు కాంగ్రెసు పార్టీకి ఎలాంటి సంబంధం లేదని ఆ పార్టీ పార్లమెంటు సభ్యులే ఇటీవల చెప్పారన్నారు. సొంత పార్టీ ఎంపీలు చెప్పిన విషయాన్ని జగన్ కుటుంబం మరిచిపోయినట్లుగా ఉందని ఎద్దేవా చేశారు. ఇప్పుడు తమ పార్టీ పైన అపవాదు వేయడం సరికాదన్నారు.
చట్టం తన పని తాను చేసుకుపోతుందని, జగన్ పార్టీని ఇబ్బందులకు గురి చేయాలనే ఆలోచన తమకు లేదన్నారు. షర్మిల బాణం ఎవరి పైకి ఎక్కుపెట్టారో తనకైతే తెలియదన్నారు. జగన్ పార్టీ అవకాశవాద రాజకీయాలకు పాల్పడుతోందని విమర్శించారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు తన పాదయాత్రకు వస్తున్నా మీకోసం కంటే వస్తున్నా నాకోసం అని పేరు పెట్టుకుంటే మంచిదని సూచించారు.
చంద్రబాబు చేనేత కార్మికుల కోసం ఉపవాసం చేయడం లేదన్నారు. ఆయన అధికారంలో తొమ్మిదేళ్లు ఉన్నారని, అప్పుడు గుర్తుకు రాని ప్రజలు, చేనేత కార్మికులు, రైతులు ఇప్పుడు గుర్తుకు వచ్చారా అని ప్రశ్నించారు. ఆయన తన ఆరోగ్యం కోసం వైద్యుల సలహాలు, సూచనల మేరకే ఉపవాసం చేస్తున్నారని చెప్పారు. ఆయన ఉపవాసం ఆహార నియమాల్లో ఓ భాగం మాత్రమే అని బొత్స సత్తిబాబు చెప్పారు.