మజ్లీస్ ఇష్యూ: జగన్ కోసమేనని సిఎం, కాదని బొత్స

మజ్లీస్ మద్దతు ఉపసంహరణతో పార్టీ అధిష్టానం ఏ విధమైన చర్యలు తీసుకుంటుందనేది ఆ ఇద్దరు నేతలకు కూడా అంతు పట్టడం లేదు. ముఖ్యమంత్రిని గానీ పిసిసి అధ్యక్షుడిని గానీ మార్చేది లేదని కాంగ్రెసు ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇంచార్జీ గులాం నబీ ఆజాద్ చెప్పినా దాన్ని ఎవరూ నమ్మడం లేదు. భాగ్యలక్ష్మి దేవాలయం - చార్మినార్ సమస్య చుట్టూ అల్లుకుని ఉన్న విషయాలను ముఖ్యమంత్రి తన నివేదికలో పొందుపరిచినట్లు తెలుస్తోంది. ప్రభుత్వం చట్టాన్ని అతిక్రమించలేదని, హైకోర్టు ఆదేశాలను మాత్రమే అమలు చేశామని ఆయన చెప్పారు.
మజ్లీస్ అధినేత అసదుద్దీన్ ఓవైసీ తరుచుగా జైలులో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిని కలిశారని, వైయస్సార్ కాంగ్రెసు పార్టీతో దోస్తీ కట్టి తన పార్టీని విస్తరించుకోవాలని అసదుద్దీన్ అనుకుంటున్నారని ఆయన తన నివేదికలో తెలిపినట్లు చెబుతున్నారు. కాంగ్రెసుతో తెగదెంపులు చేసుకోవడానికి అసదుద్దీన్ భాగ్యలక్ష్మి ఆలయం అంశాన్ని సాకుగా మాత్రమే తీసుకున్నారని ఆయన చెప్పినట్లు సమాచారం.
హైదరాబాదులోని పాతబస్తీలో శాంతిభద్రల పరిరక్షణకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు అన్ని వైపుల నుంచి ప్రశంసలు లభిస్తున్నాయని కూడా ఆయన చెప్పుకున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వం నుంచి మజ్లీస్ ఇతర డిమాండ్లు పెట్టిందంటూ కూడా ఆయన చెప్పినట్లు తెలుస్తోంది. కాంగ్రెసు పార్టీ మతతత్వంతో వ్యవహరిస్తోందని ఒక్క ప్రతిపక్షం కూడా వ్యాఖ్యానించకపోవడాన్ని ఆయన గుర్తు చేశారు.
అయితే, బొత్స సత్యనారాయణ వాదన మరో రకంగా ఉన్నట్లు చెబుతున్నారు. అసదుద్దీన్ ఓవైసీతో రాజకీయపరమైన చర్చలు చేయాల్సి ఉండిందని, ప్రభుత్వం ఏకపక్షంగా వ్యవహరించిందనే అభిప్రాయం కలిగిందని, దాన్ని నివారించడానికి ముందే మజ్లీస్తో చర్చలు జరపాల్సి ఉండిందని ఆయన తన నివేదికలో చెప్పినట్లు తెలుస్తోంది. అధికార యంత్రాంగం జోక్యమే ఎక్కువగా కనిపించిందని, ముఖ్యమంత్రి అధికారులు చెప్పినట్లు వినడం వల్లనే మజ్లీస్ తెగదెంపులు చేసుకోవడానికి పరిస్థితి దారి తీసిందని ఆయన తన నివేదికలో పొందుపరిచినట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications