టిడిపి అఫైర్స్: అధినేత చంద్రబాబు పొలిటికల్ మిషన్
హైదరాబాద్: నాయకులు, శాసనసభ్యులు దూరమవుతున్న తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు మొక్కవోని ధైర్యంతో పాదయాత్ర సాగిస్తున్నారు. పార్టీలో వ్యవహారాలన్నింటికీ చంద్రబాబు ఒక్కరే బాధ్యత వహించాల్సి ఉంటుంది. పార్టీ బలపడినా, బలహీనపడినా అందుకు పూర్తి చంద్రబాబుదే అనే ధోరణి చాలా కాలంగా ఉంది.

యనమల రామకృష్ణుడు: తెలుగుదేశం పార్టీ అత్యంత సీనియర్ నేతగా ఇప్పుడు యనమల రామకృష్ణుడే చెప్పుకోవాల్సి ఉంటుంది. ఆయన తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో శానససభ స్పీకర్గా కూడా పని చేసేవారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్పై విమర్శలు సంధించడంలో ఆయన ముందుంటున్నారు. విశేష రాజకీయ అనుభవం ఉంది. పార్టీ అవసరాలను బట్టి లోకసభకు పోటీ చేయాలని అడిగినా చేస్తానని అంటున్నారు. ఎర్రంనాయుడు మృతి తర్వాత ఆయనపై బాధ్యత పెరిగింది.

సిఎం రమేష్: ఆయన రాజకీయ నాయకుడిగా కన్నా పారిశ్రామికవేత్తగానే ఎక్కువ గుర్తింపు పొందారు. రాజకీయ నిర్ణయాల విషయంలో చంద్రబాబు సిఎం రమేష్ మాటలను శ్రద్దగా వింటారని వినికిడి. సిఎం రమేష్తో చంద్రబాబు తనయుడు నారా లోకేష్కు వ్యాపార సంబంధాలున్నాయని, అందువల్లనే రమేష్కు చంద్రబాబు ప్రాధ్యానం ఇస్తారని గిట్టనివారు విమర్శిస్తుంటారు.

నామా నాగేశ్వరరావు: ఈయన కూడా పారిశ్రామికవేత్తనే. రాజకీయ నాయకుడిగా ఆయన తన సత్తా చాటుతున్నారు కూడా. తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావును విమర్శించడం ఆయనకు నచ్చిన విద్యల్లో ఒక్కటని అంటారు. ఖమ్మం జిల్లాకు చెందిన నామా నాగేశ్వర రావు ఢిల్లీలో పార్టీ వ్యవహారాలను, ఇతర పార్టీలతో సంబంధాలను చూస్తుంటారు.

ఎర్రబెల్లి దయాకర్ రావు: తెలంగాణ విషయంలో చంద్రబాబు వ్యూహాన్ని తుచ తప్పకుండా పాటిస్తారని అంటారు. కెసిఆర్ సామాజిక వర్గానికే చెందిన ఆయన తెరాసను ఎదుర్కోవడానికి చంద్రబాబు వాడుతున్న ఆయుధంగా పనిచేస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. కెసిఆర్పై దూకుడుగా వ్యాఖ్యలు చేయడం ఆయనకు అత్యంత ప్రీతిపాత్రమైన విషయం. పార్టీలో నాగం జనార్దన్ రెడ్డికి కళ్లెం వేసి ఆయన నుంచి పార్టీ తెలంగాణ ఫోరం నాయకత్వాన్ని దక్కించుకున్నారు. నాగం జనార్దన్ రెడ్డిపై చంద్రబాబు వ్యూహాన్ని ఎర్రబెల్లి పకడ్బందీగా అమలు చేశారని అంటారు.

మోత్కుపల్లి నర్సింహులు: నల్లగొండ జిల్లాకు చెందిన మోత్కుపల్లి నర్సింహులు చంద్రబాబుకు అత్యంత నమ్మకమైన నాయకుడు. దూకుడుగా వ్యవహరించే నర్సింహులు నల్లగొండ జిల్లాలో మరో నాయకుడిని ఎదగకుండా చేశారని అంటారు. మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి (ఎమ్మార్పీయస్) అండదండలు టిడిపికి లభించడానికి ఆయన ప్రధాన కారణమని చెబుతారు. నర్సింహులు మంత్రిగా పనిచేశారు. కెసిఆర్పై గుక్క తిప్పుకోకుండా వ్యాఖ్యలు చేసే నాయకుల్లో ఈయన ముఖ్యులు.

రేవంత్ రెడ్డి: ఇటీవలి కాలంలో తెలుగుదేశంలో కీలక పాత్ర పోషిస్తున్న నాయకుడు. మాటలను ఈటెల్లా విసరగల నైపుణ్యం రేవంత్ రెడ్డి సొంతు. చంద్రబాబుపై ఈగ వాలకుండా చూడడానికి ఎక్కువ ప్రయత్నిస్తారని అంటారు. అటు వైయస్ జగన్ పార్టీని, ఇటు కెసిఆర్ పార్టీని ఏకకాలంలో ఏకి పెట్టగల సమర్థుడు.
సీనియర్లు పలువురు దూరమైనా, వారి స్థానాలను తనకు అత్యంత నమ్మకమైనవారితో, తన వెంట నడిచే వారితో ఆయన భర్తీ చేసుకుంటూ పోతున్నారు. నందమూరి హరికృష్ణ వంటి నాయకులు అలిగి పక్కకు జరిగినా ఆయన పట్టించుకోవడం లేదు. తన మాటను జవదాటడం అటుంచి, వ్యతిరేకించేవారిని కూడా ఆయన పల్లెత్తు మాట అనకుండా పక్కకు పెట్టడం చాణక్య నీతిగా ఆయన అమలు చేస్తూ వస్తున్నారు.
చంద్రబాబుకు ఇప్పుడు సీనియర్లలో అతి కొద్ది మాత్రమే మిగిలినట్లు కనిపిస్తున్నారు. యనమల రామకృష్ణుడు, దేవేందర్ గౌడ్, కోడెల శివప్రసాద రావు వంటి సీనియర్లు మాత్రమే ఆయన వెంట కనిపిస్తున్నారు. వారు చంద్రబాబు మాటను జవదాటకుండా తమ పని తాము చేసుకుంటూ పోతారు. చంద్రబాబుపై విమర్శలకు ధాటిగా జవాబిస్తారు. ఇతర పార్టీలను ఎదుర్కునే క్రమంలో చంద్రబాబు వ్యూహాలకు, ఎత్తుగడలకు అనుగుణంగా వారు నడుచుకుంటారు. చెప్పాలంటే, చంద్రబాబు మనసెరిగి మసులుకుంటారు.












Click it and Unblock the Notifications