సీమాంధ్ర నేతల ఒత్తిడే: షిండేపై కోదండ, పొన్నం ఫైర్

తెలంగాణ జేఏసీ బస్సు యాత్ర రెండో రోజు మంగళవారంనాడు కూడా మహబూబ్నగర్ జిల్లాలో కొనసాగింది. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ఉద్యమాలు, పోరాటాల ద్వారానే తెలంగాణ సాధించుకుంటామని అన్నారు. కేంద్ర ప్రభుత్వం వైఫల్యాల వల్లనే తెలంగాణలో ఆత్మహత్యలు చోటు చేసుకుంటున్నాయని ఆయన ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో తెలంగాణ ఉందన్నారు.
తెలంగాణ రాష్ట్రం ఇస్తే ఇతర రాష్ట్రాల డిమాండ్ తెరపైకి వస్తుందన్న వాదన వట్టి మాటేనని, రోగం ఉన్నవారికి మందు వేయాలిగానీ అందరినీ ఒకే గాటన కట్టడం కేంద్ర ప్రభుత్వానికి తగదని కోదండరాం సూచించారు. సీమాంధ్ర నేతలకు తలొగ్గే షిండే ఇతర రాష్ట్రాల డిమాండ్ గురించి ప్రస్తావించారని ఆయన అన్నారు.
కేంద్ర హోం మంత్రి సుశీల్ కుమార్ షిండేపై కాంగ్రెసు కరీంనగర్ పార్లమెంటు సభ్యుడు పొన్నం ప్రభాకర్ వ్యంగ్యాస్త్రాలు విసిరారు. తెలంగాణపై అఖిల పక్ష సమావేశంలో చర్చించిన తర్వాత మళ్లీ చర్చలేమిటని ఆయన మంగళవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అడిగారు. తెలంగాణపై చెప్పిన గడువును పాటించకపోవడం సుశీల్ కుమార్ షిండే తప్పిదమేనని ఆయన న్యూఢిల్లీలో విమర్శించారు. రాజీనామాలు చేయడమా, పార్లమెంటు సమావేశాలు బహిష్కరించడమా అనే విషయంపై నిర్ణయం తీసుకుంటామని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications