అవిశ్వాసం పెట్టి తుస్సుమనిపించారు: చంద్రబాబు
నాలుగేళ్లుగా ప్రజా సమస్యలకు పరిష్కారం దొరకడం లేదని ఆయన అన్నారు. ప్రభుత్వం ప్రజా సమస్యలను గాలికి వదిలేసిందని చంద్రబాబు మండిపడ్డారు. స్పీకర్ నాదెండ్ల మనోహర్, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి పార్టీని, ప్రభుత్వాన్ని కాపాడుకోవడానికి ప్రయత్నిస్తున్నారని ఆయన విమర్శించారు.
ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానాన్ని ప్రజా సమస్యలపై పెట్టాలని ఆయన అన్నారు. స్వార్థ ప్రయోజనాల కోసం అవిశ్వాస తీర్మానం పెట్టి తుస్సుమనిపించారని ఆయన అన్నారు. బ్లాక్ మెయిల్ కోసం తెరాస, లాలూచీ కోసం వైయస్సార్ కాంగ్రెసు అవిశ్వాస తీర్మానాన్ని ప్రతిపాదించాయని ఆయన అన్నారు.
శాసనసభా సమావేశాలు నడిచే పరిస్థితి లేదని ఆయన అన్నారు. వాయిదా పడుతూ పోతుందని, ప్రభుత్వం దాన్నే కోరుకుంటోందని ఆయన అన్నారు. తనను ఇబ్బందుల్లో పెట్టాలని వైయస్ రాజశేఖర రెడ్డి చాలా ప్రయత్నించాడు గానీ ఏమీ చేయలేకపోయాడని ఆయన పైడిపర్రులో ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తూ అన్నారు.