వీగిన అవిశ్వాసం: తగ్గిన కిరణ్ బలం, జగన్ వైపు 9
ఏడుగురు సభ్యులున్న మజ్లీస్ ఓటింగుకు దూరంగా ఉంది. తెలుగుదేశం పార్టీ తటస్థ వైఖరి అవలంబించింది. తెలుగుదేశం పార్టీ శుక్రవారం రెండోసారి తన సభ్యులకు రెండోసారి విప్ జారీ చేసింది. అనారోగ్యంతో బాధపడుతున్న మాజీ మంత్రి పి. శంకర రావు సభకు వచ్చారు. చివరి నిమిషంలో ముఖ్యమంత్రి బుజ్జగించినా వినకుండా జోగి రమేష్ అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా ఓటేశారు.
అవిశ్వాసానికి వ్యతిరేకంగా 142 మంది ఓటేశారు. అవిశ్వాసానికి మద్దతుగా 58 మంది సభ్యులు ఓటేశారు. 64 మంది సభ్యులు తటస్థ వైఖరి అవలంబించారు. 26 మంది గైర్హాజరయ్యారు.
కాంగ్రెసుపై తిరుగుబాటు చేసి వైయస్సార్ కాంగ్రెసుకు మద్దతుగా అవిశ్వాస తీర్మానాన్ని బలపరిచిన 9 మంది సభ్యులు - జోగి రమేష్, సుజయ కృష్ణరంగారావు, పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి, మద్దాలి రాజేష్, గొట్టిపాటి రవికుమార్, శివప్రసాద్ రెడ్డి, అళ్లనాని, పేర్ని నాని, ద్వారంపూడి చంద్రశేఖర రెడ్డి ఉన్నారు. తెలుగుదేశం పార్టీకి చెందిన ఆరుగురు సభ్యులు అమర్నాథ్ రెడ్డి, వనిత, బాలనాగిరెడ్డి, అళ్ల నాని, ప్రవీణ్ రెడ్డి, సాయిరాజ్ జగన్కు మద్దతుగా అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా ఓటేశారు.
నిజానికి శాసనసభలో కాంగ్రెసు బలం 155. అయితే ప్రభుత్వానికి అనుకూలంగా 142 ఓట్లు వచ్చాయి. మర్రి శశిధర్ రెడ్డి, కొర్ల భారతి శాసనసభకను హాజరు కాలేదు. దీంతో కాంగ్రెసు బలం సభలో 144కు పడిపోయింది. తాము నైతిక విజయం సాధించామని తెరాస సభ్యుడు హరీష్ రావు అన్నారు. సాంకేతికంగా మాత్రమే గెలిచిందని, గెలిచి ఓడిందని ఆయన అన్నారు. ప్రభుత్వం మైనారిటీలో పడిపోయిదని తేలిందని ఆయన అన్నారు. తెలుగుదేశం పార్టీ కలిసి వచ్చి ఉంటే ప్రభుత్వం పడిపోయి ఉండేదని ఆయన అన్నారు. చంద్రబాబు వల్లనే అవిశ్వాస తీర్మానం వీగిపోయిందని, చంద్రబాబు చారిత్రక తప్పిదం చేశారని వైయస్సార్ కాంగ్రెసు శాసనసభ్యురాలు శోభా నాగిరెడ్డి అన్నారు.