నష్టం జరగకూడదనే పెట్టడం లేదు: తెలంగాణపై సిఎం
కేంద్రం నిర్ణయం తీసుకున్న తర్వాత అది జరగకుండా చేసింది ఈ సభనే కదా అని తెరాస సభ్యుడు హరీష్ రావు అన్నారు. రాజకీయ పార్టీలు చెప్పినదానికి, ఇచ్చిన హామీకి కట్టుబడి ఉంటే సభలో తీర్మానం పెడితే
నష్టం జరగదని ఆయన అన్నారు. రాష్ట్ర శాసనసభలో తీర్మానం చేస్తే కేంద్రం వేగంగా నిర్ణయం తీసుకోవడానికి వీలవుతుందని ఆయన అన్నారు. ముఖ్యమంత్రి ప్రతిస్పందనకు ముందు ఈటెల రాజేందర్ మాట్లాడుతూ - కాంగ్రెసు వివిధ సందర్భాల్లో తెలంగాణపై హామీ ఇచ్చిందని గుర్తు చేశారు.
తమ ప్రాంత ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగానే తాము అవిశ్వాసం పెట్టామని ఆయన చెప్పారు. తెలంగాణలోని అన్ని వర్గాల ప్రజలు కోరుకుంటున్నారని, అందుకు పోరాటం చేస్తున్నాయని ఆయన అన్నారు. ప్రజా సమస్యలతో పాటు తెలంగాణ రాష్ట్ర సాధన కూడా తమకు ముఖ్యమని ఆయన అన్నారు. తెలంగాణపై కాంగ్రెసు పార్టీ ప్రజల కళ్లలో కారం కొట్టిందని ఆయన అన్నారు. కాంగ్రెసు నాయకులు తెలంగాణ ప్రజలను అవమానించే విధంగా మాట్లాడారని ఆయన అన్నారు.
వేయి మంది బిడ్డలు ఆత్మబలిదానం చేసుకుంటే మీరు చావకండి అనే భరోసా ఇవ్వని సభపై విశ్వాసం ఎందుకు ఉండాలని ఆయన అడిగారు. ప్రమాదాల్లో మరణిస్తే సంతాపం ప్రకటించే సభలు వేయిమంది బిడ్డలు చనిపోతే సంతాపం చెప్పని చట్టసభలపై ఎందుకు విశ్వాసం ఉండాలని ఆయన ప్రశ్నించారు. పార్టీ హామీ ఇచ్చిన తర్వాత అమలు చేయాల్సిన బాధ్యత లేదా అని ఆయన అడిగారు. కమిటీలతో తెలంగాణపై కాలయాపన చేస్తున్నారని ఆయన విమర్శించారు. తెలంగాణ అంశాన్ని నాన్చుతున్న ఈ ప్రభుత్వానికి కొనసాగే అర్హత లేదని ఆయన అన్నారు. నీళ్లు, ఉద్యోగాలు దోచుకున్నారనే భావన తెలంగాణ ప్రజలకు ఉందని ఆయన అన్నారు