కోదండ, ఈటెలకి షాక్: నో బెయిల్, అదివారం బంద్

కోదండరామ్, ఈటెల రాజేందర్, జూపల్లి కృష్ణా రావు, శ్రీనివాస్ గౌడ్ సహా ఎనిమిది మందికి కూడా అలంపూర్ న్యాయస్థానం బెయిల్ను నిరాకరించింది. వారికి ఏప్రిల్ 4వ తేది వరకు కోర్టు రిమాండ్ విధించింది. నిన్న సడక్ బంద్ కార్యాక్రమంలో పోలీసులు దాదాపు 1177 మంది తెలంగాణవాదులను అరెస్టు చేసింది. అందులో జెఏసి నేతలు, తెరాస నేతలు కూడా ఉన్నారు.
అరెస్టుల వెనుక ముఖ్యమంత్రి, డిజిపి
తెలంగాణ రాజకీయ ఐక్యకార్యాచరణ సమితి చైర్మన్ ఆచార్య కోదండరామ్తో పాటు తమ పార్టీ ఎమ్మెల్యేలు, ఇతర తెలంగాణవాదుల అరెస్టు వెనుక ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, డిజిపి దినేష్ రెడ్డిల హస్తం ఉందని తెరాస సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు ఆరోపించారు. అవిశ్వాసం పెడితే అరెస్టు చేస్తున్నారని నిప్పులు చెరిగారు.
అన్యాయం జరిగిందంటే నిధులు ఇవ్వామని సవాల్ చేశారని గుర్తు చేశారు. ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరిస్తే సిబిఐ కేసులు పెడుతున్నారని, ఇదే కాంగ్రెసు నైజం అని ధ్వజమెత్తారు. తమకు న్యాయస్థానాల పైన నమ్మకం ఉందన్నారు.
ఎల్లుండికి తెలంగాణ బంద్ వాయిదా
సడక్ బంద్ అరెస్టులకు నిరసనగా రేపు(శనివారం) తలపెట్టిన బంద్ను ఎల్లుండికి వాయిదా వేశారు. పదో తరగతి పరీక్షల నేపథ్యంలో బంద్ను వాయిదా వేశారు. తెలంగాణ బందుకు ఉస్మానియా ఐక్యకార్యాచరణ సమితి, ప్రజా సంఘాల ఐకాస శుక్రవారం పిలుపునిచ్చాయి.












Click it and Unblock the Notifications