సా...గుతోంది: హరికృష్ణ, జూనియర్లతో జగన్ పార్టీ ఫ్లెక్సీ
తాజాగా కరీంనగర్ జిల్లాలో మరో ఫ్లెక్సీ వెలిసింది. ఇప్పటి వరకు జూనియర్ ఎన్టీఆర్, స్వర్గీయ నందమూరి తారక రామారావు ఫోటోలతోనే జగన్ పార్టీ ఫ్లెక్సీలు వెలిశాయి. తాజా కరీంనగర్లోని తెలంగాణ చౌక్లో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో హరికృష్ణ, జూనియర్ ఫోటోలను పెట్టారు. జిల్లాలోని మానకొండూరు నియోజకవర్గంలో జగన్ పార్టీ సమన్వయకర్త అజయ్ వర్మ ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు. ఇందులో జూనియర్తో పాటు హరికృష్ణ ఫోటోను పెట్టారు.
విశాఖలో జగన్ పార్టీ వర్సస్ టిడిపి
విశాఖపట్నం జిల్లాలో బందు సందర్భంగా వైయస్సార్ కాంగ్రెసు పార్టీల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. జగదాంబ సెంటరులో విద్యుత్ సమస్యలపై విపక్షాలు ఆందోళన చేపట్టాయి. ఈ ధర్నాలో లెఫ్ట్, బిజెపి, టిడిపి, వైయస్సార్ కాంగ్రెసు పార్టీలు పాల్గొన్నాయి. ఈ సందర్భంగా ప్రస్తుత విద్యుత్ సంక్షోభానికి దివంగత వైయస్ రాజశేఖర రెడ్డియే కారణమని టిడిపి మండిపడింది. దీంతో ఇరు పార్టీల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. పోలీసులు కల్పించుకొని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.
కనిగిరిలోను వైయస్సార్ కాంగ్రెసు పార్టీ, టిడిపి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. కాగా, రాష్ట్రవ్యాప్తంగా బందు కొనసాగుతోంది. పాక్షిక ప్రభావం కనిపిస్తోంది. విపక్షాలు అన్ని బందులో పాల్గొంటున్నాయి. విపక్షాలు ఆయా బస్ డిపోల వద్ద కూర్చొని బస్సులు బయటకు రాకుండా అడ్డుకుంటున్నారు.